Monsoon:మళ్లీ పుంజుకున్న రుతుపవనాలు! వర్షపాత సరళిలో భారీ మార్పులు?
భారతదేశంలో వర్షపాత సరళి సరికొత్త రూపాన్ని సంతరించుకుంటోంది. తాజాగా రోదసి నుంచి 'ఇన్సాట్-3డీఎస్' శాటిలైట్ పంపిన పనోరమిక్ థర్మల్ ఇన్ఫ్రారెడ్ చిత్రాలు దేశంలో మళ్లీ రుతుపవనాల జోరు పెరగబోతున్నట్లు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా తూర్పు, మధ్య భారతదేశాన్ని కప్పేస్తూ భారీ స్థాయిలో సాంద్రత కలిగిన మేఘాలు ఆవరించి ఉన్నట్లు ఈ ఉపగ్రహ చిత్రాల ద్వారా వెల్లడైంది. రాబోయే రోజుల్లో దేశంలో వర్షాలు ఒకేలా కాకుండా, ప్రాంతాల వారీగా అసమానంగా కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఉపగ్రహ చిత్రాల విశ్లేషణ ప్రకారం.. ఇండో-గంగా మైదాన ప్రాంతాలు, తూర్పు రాష్ట్రాలు, మధ్య భారతదేశం వ్యాప్తంగా దట్టమైన మేఘాల చట్రం విస్తరించి ఉంది. బిహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో బలమైన ఉపరితల గాలులు, మేఘాల సాంద్రత ఎక్కువగా నమోదైంది. ఈ వాతావరణ పరిణామాల వల్ల ఈ ప్రాంతాల్లో విస్తారంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. సెప్టెంబర్ మొదటి రెండు వారాల పాటు తూర్పు భారతదేశంలో ఈ వర్షపాత ప్రభావం కొనసాగవచ్చని వాతావరణ అంచనాలు చెబుతున్నాయి.

ఢిల్లీ-ఎన్సీఆర్లో క్షణాల్లో మారే వాతావరణం!
దేశ రాజధాని ఢిల్లీ , దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో స్థానిక వాతావరణంలో మార్పుల వల్ల ఆకస్మిక వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. పగటిపూట నమోదయ్యే ఉష్ణోగ్రతలు, తేమ వల్ల మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో ఆకస్మికంగా మేఘాలు ఏర్పడి ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. అయితే ఇది ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యే 'లోకలైజ్డ్' వర్షపాతం కావడంతో.. ఒకే నగరంలో ఒక వైపు కుండపోత పడుతుంటే, మరోవైపు వాతావరణం పొడిగా ఉండే వింత పరిస్థితులు కనిపించవచ్చు.
దక్షిణ, పశ్చిమ జిల్లాల్లో పొడి వాతావరణం!
తూర్పు భారతదేశం జలమయం కాబోతుంటే.. వాయువ్య, పశ్చిమ , దక్షిణ భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో మాత్రం భిన్నమైన పరిస్థితులు నెలకొననున్నాయి. ఈ ప్రాంతాల్లో మేఘాల సాంద్రత తక్కువగా ఉండటంతో వర్షాల తీవ్రత తగ్గి, పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్పతి. రోదసి నుంచి తీసిన ఉపగ్రహ చిత్రాలు భారతదేశ రుతుపవనాల మారుతున్న రూపురేఖలను కళ్లకు కట్టినట్లు చూపుతున్నాయి. కొన్ని ప్రాంతాలను వర్షాలు ముంచెత్తుతుంటే, మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం రుతుపవనాల ప్రభావం కాస్తంత తగ్గనుంది.














Click it and Unblock the Notifications