నరేంద్రమోడీలో అసహనం.. కేజ్రీవాల్ పై పెరుగుతున్న దాడులు..
గుజరాత్ అసెంబ్లీకి ఈ ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడీ సొంత రాష్ట్రం కావడంతో బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. అయితే ఈసారి ఎన్నికల్లో విజయం సాధించి సంచలనం సృష్టించాలని ఆమ్ ఆద్మీ ప్రయత్నిస్తోంది. సర్వే లు నిర్వహించిన సంస్థలు కూడా ఆప్ విజయావకాశాలను కొట్టిపారేయడంలేదు. కాంగ్రెస్ పార్టీని మించి బలంగా ఎదగాలని ఆప్ ప్రయత్నిస్తోంది. ఈ తరుణంలో ఆమ్ ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్లో ముమ్మరంగా పర్యటిస్తున్నారు. ఇటీవలే ఆయన ఒక ఆటోడ్రైవర్ ఇంటికి భోజనానికి వెళ్లారు.

కేజ్రీవాల్ పై ప్లాస్టిక్ బాటిల్ విసిరారు!
తాజాగా రాజ్ కోట్లో జరిగిన గర్బా కార్యక్రమంలో అరవింద్ పాల్గొన్నారు. అయితే ఎవరో దుండగులు కేజ్రీవాల్ దిశగా ప్లాస్టిక్ వాటర్ బాటిల్ విసిరారు. ఈ విషయాన్ని ఆప్ నాయకులు వెల్లడించారు. అయితే ఆ బాటిల్ ఆయనకు తగల్లేదని, తలపై నుంచి వెళ్లి పక్కన పడిందని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. అనుకోకుండా ఎవరైనా విసిరారా? లేదంటే అరవింద్ ను లక్ష్యంగా చేసుకొని విసిరారా? అనేది స్పష్టత రాలేదు. వడోదర విమానాశ్రయంలో కూడా ఈ తరహా చేదు అనుభవమే ఎదురైంది. విమానాశ్రయం నుంచి బయటకు రాగానే మోడీ మోడీ మోడీ అంటూ అక్కడివారు నినాదాలు చేశారు.

ఆప్ పై ఢిల్లీలో ఈడీ దాడులు!
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆప్ నేత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై ఈడీ దాడులు జరిగాయికానీ ఏమీ తేల్చలేకపోయారు. మరో ఆప్ ఎమ్మెల్యేపై ఈడీ దాడికి దిగింది. ఏ సమయంలో ఏ ఆప్ ఎమ్మెల్యేమీద ఈడీ దాడిచేస్తుందా? సీబీఐ దాడి చేస్తుందా? ఆదాయపు పన్నుశాఖ అధికారులు దాడిచేస్తారా? అన్నట్లుగా ఢిల్లీలో వాతావరణం ఉంది. ఇప్పుడు ఈ దాడులన్నీ పంజాబ్ కి పాకాయి. అక్కడ కూడా ఆప్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. భగవంత్ సింగ్ మాన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.

ఆప్ కి వచ్చే ఓట్లన్నీ బీజేపీ నుంచే బదలాయింపు?
గుజరాత్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై అరవింద్ కేజ్రీవాల్ దృష్టిసారించారు. ఆ పార్టీకి అక్కడ ఎవరూ ప్రచారం చేయకూడదని, మోడీకి వ్యక్తిగతసలహాదారుగా ఉన్న వ్యక్తి ఎలక్ట్రానిక్ మీడియాను బెదిరించారు. దీనికి సంబంధించిన వీడియోను, ఆడియోను బయటపెడతామని కేజ్రీవాల్ హెచ్చరించారు. ఆప్ కి వచ్చే ఓట్లన్నీ బీజేపీ నుంచే రాబోతున్నాయని ఆపార్టీ నిర్వహింపచేసిన సర్వేలో వెల్లడైందని సమాచారం. అందుకే ఆ పార్టీని మొదట్లోనే నిరోధించగలిగితే తాము మరోసారి అధికారంలోకి రావచ్చని పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే కేజ్రీవాల్ ఎక్కడా వెనక్కి తగ్గడంలేదు. ఎట్టి పరిస్థితుల్లోను పంజాబ్ లో సాధించినట్లే గుజరాత్ లో కూడా ఘనవిజయం సాధిస్తామని ప్రకటించారు.












Click it and Unblock the Notifications