కాంగ్రెస్ అవినీతి, రుణమాఫీలపై ధ్వజమెత్తిన ప్రధాని మోడీ
రైతులకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ధ్వజమెత్తారు ప్రధాని నరేంద్రమోడీ. హిమాచల్ ప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అయి ఒక ఏడాది పూర్తయిన సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు అవినీతికి పాల్పడిందంటూ ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పలు వేదికలపై నిప్పులు చెరుగుతున్న నేపథ్యంలో మోడీ కూడా కౌంటర్ అటాక్కు దిగారు.
కాంగ్రెస్ అవినీతిని బయటపెట్టే కాపలాదారుడిని చూసి విపక్షాలు భయపడుతున్నాయని మోడీ అన్నారు. వాచ్మ్యాన్ నిద్రపోడు అవినీతికి పాల్పడే ఎదుటి వారిని నిద్రపోనివ్వడు అని వారికి తెలుసని మోడీ ఎద్దేవా చేశారు. ప్రజల ఆశీర్వాదంతో అవినీతి రహిత దేశంగా తీర్చుదిద్దుతానని ప్రధాని మోడీ అన్నారు. దాదాపు గంటసేపు ప్రసంగించిన ప్రధాని మోడీ ఎక్కడా ప్రత్యక్షంగా కాంగ్రెస్ పేరు ఎత్తలేదు.అయితే ఆయన ప్రసంగంలో ఎవరినైతే లక్ష్యంగా చేసుకుని మాట్లాడారో అది స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పారు. బూటకపు హామీలు ఇచ్చే వారిని నమ్మొద్దని రైతులకు పిలుపునిచ్చారు ప్రధాని. నెరవేర్చలేని హామీలను రాజకీయనాయకులు ఇవ్వకూడదని ఆయన చెప్పారు. కేవలం ఎన్నికల్లో గెలిచేందుకు మాత్రమే హామీలు ఇవ్వకూడదని మోడీ అన్నారు.
2009లో నాటి యూపీఏ సర్కార్ రైతు రుణమాఫీ హామీ ఇచ్చిందని...రూ.6లక్షల కోట్లు రైతు రుణాలు మాఫీ చేయాల్సి ఉండగా కేవలం 10శాతం మాత్రమే మాఫీచేసిందని ధ్వజమెత్తారు మోడీ. ఆ సమయంలో రూ.52వేల కోట్లు రాగా అందులో చాలామంది రైతులకు ఆ డబ్బు చేరలేదని చెప్పారు. ఇక పంజాబ్లో కూడా రైతు రుణమాఫీ అని తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క రైతుకు కూడా రుణమాఫీ చేయలేదని ధ్వజమెత్తారు. కర్నాటకలో కూడా ఇదే జరుగుతోందన్నారు. ఒకే ర్యాంకు ఒకే పెన్షన్ పద్దతిలో ఎన్డీఏ ప్రభుత్వం దేశానికి సేవలందించిన జవాన్లకు 12వేల కోట్ల రూపాయలు ఇచ్చిందని గుర్తుచేశారు.
గత 40 ఏళ్లుగా వన్ ర్యాంక్ వన్ పెన్షన్ విధానాన్ని అమలు చేయాల్సిందిగా జవాన్లు కోరుతున్నప్పటికీ వారిని పట్టించుకున్న ప్రభుత్వాలు లేవని... సైనికుల కోసం కేవలం రూ.500 కోట్లు కేటాయించి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశాయని మోడీ మండిపడ్డారు. తను ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తాను ఫైలు తెప్పించుకుని చేయాల్సిన పనిని ముందుగా చేయడంతో అధికారులు విస్మయానికి గురయ్యారని చెప్పారు. వారి పెన్షన్ కోసం రూ.12వేల కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. జవాన్లను పిలిచి నాలుగైదు ఇన్స్టాల్మెంట్లలో తీసుకోవాల్సిందిగా కోరగా అందుకు వారు అంగీకరించారని చెప్పారు.