రేప్ చేస్తే.. రాజస్థాన్లో మరణశిక్ష! కనీసం 14 ఏళ్ల కఠిన జైలుశిక్ష..
జైపూర్: అత్యాచార నిందితులకు మరణశిక్షను ఖరారు చేస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు రాజస్థాన్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. 12 ఏళ్ల వయసు లోపున్న బాలికలను రేప్ చేసిన వ్యక్తికి మరణ దండన విధిస్తారు. ఈ తరహా బిల్లును గతంలో మధ్యప్రదేశ్ రాష్ట్రం కూడా ఆమోదించింది.
ఇప్పుడు అదే బాటలో రాజస్థాన్ కూడా నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లును రాజస్థాన్ అసెంబ్లీలో బుధవారం ప్రవేశపెట్టారు. ఐపీసీలో 376ఏఏ సెక్షన్ను కలపాలని ఆ బిల్లులో కోరారు. ఆ సెక్షన్ ప్రకారం.. 12 ఏళ్ల లోపు బాలికలను ఎవరైనా రేప్ చేస్తే, వాళ్లకు మరణ శిక్షను ఖరారు చేస్తారు.
లేదంటే కనీసం 14 ఏళ్ల కఠిన జైలుశిక్షను అమలు చేస్తారు. గ్యాంగ్ రేప్ కేసుల్లో 376 డీడీ సెక్షన్ను జతకలపనున్నారు. అత్యాచారాలు, గ్యాంగ్ రేప్లు ఎక్కువ అవుతున్నాయని, అలాంటి ఘటనలు హేయమైనవని, అందుకే కఠిన చట్టాలను రూపొందిస్తున్నట్లు రాజస్థాన్ ప్రభుత్వం వెల్లడించింది.
గత డిసెంబర్లోనే మధ్యప్రదేశ్ ఈ తరహా బిల్లుకు ఆమోదం తెలిపింది. హర్యానా రాష్ట్రం కూడా ఐపీసీ సెక్షన్లో ఇలాంటి మార్పులను చేసింది. ఇప్పుడు తాజాగా రాజస్థాన్ ప్రభుత్వం కూడా రేపిస్టులకు ఇలా కఠినమైన చట్టాన్ని తీసుకొచ్చింది.