శశికళకు మరో భారీ షాక్ -వంద కోట్ల ఆస్తుల జప్తు..!!
చిన్నమ్మకు మరో భారీ షాక్ తగిలింది. వీకే శశికళకు సంబంధించిన వంద కోట్ల ఆస్తులను ఆదాయపు పన్ను విభాగం జప్తు చేసింది. గతంలోనే శశికళ ఆస్తులను జప్తు చేసారు. చెన్నెలో శశికళకు సంబంధించిన 65 ఆస్తులను గతేడాది ఐటీ అటాచ్ చేసింది. ఇప్పుడు చెన్నె శివారులోని పయ్యనూర్లో ఉన్న ఆస్తులను ఐటీ విభాగం సొంతం చేసుకుంది. 2019లో రూ.1,600 కోట్ల ఆస్తులను కూడా స్వాధీనం చేసుకున్నారు. 2017లో 187 ఆస్తులపై తనిఖీలు జరిగాయి. రూ.1,430 కోట్ల పన్ను చెల్లించలేదని శశికళపై అభియోగాలు ఉన్నాయి.
చెన్నె శివారులోని పయ్యనూర్లో ఉన్న ఆస్తులను ఐటీ విభాగం సొంతం చేసుకుంది. 1991 జూలై నుంచి ఏప్రిల్ 1996 వరకు శశికళ బంధువు ఇళవరసి, వీఎన్ సుధాకరన్ పేర్ల భారీగా ఆస్తుల కొనుగోళ్లు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1991-1996 మధ్య 24 ఎకరాలు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. కోర్టు ఆదేశాల మేరకు ఐటీ విభాగం చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ అప్పట్లో రూ.20 లక్షలు ఉండగా ఇప్పుడు దాని విలువ ఏకంగా రూ.100 కోట్లకు చేరింది.
66 ఏళ్ల శశికళ 2017 ఫిబ్రవరిలో జైలు జీవితం గడిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జైలు నుంచి శశికళ విడుదలవడంతో తమిళనాడులో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. అక్రమాస్తుల కేసులో ఇంకా ఆమెపై విచారణ కొనసాగుతోంది. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె కీలక పాత్ర పోషిస్తుందని అందరూ ఊహించగా అనూహ్యంగా ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించి సంచలనం సృష్టించారు. ప్రస్తుతం ఆమె మళ్లీ రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
అయితే, ప్రస్తుతం డీఎంకే అధికారంలో ఉండటం .. అన్నా డీఎంకే నేతలు శశికళ రాకను ససేమిరా అంటున్న పరిస్థితితుల్లో శశికళ తన నిర్ణయం మార్చుకున్న ఫలితం కనిపించే అవకాశాలు లేవనే చెప్పాలి. తాజాగా పన్నీర్ సెల్వం ను శశికళ పరామర్శించారు. ఇక, తమిళనాడు రాజకీయాల్లో తాజా ఎన్నికల సమయంలోనే చిన్నమ్మ తన ప్రభావం చూపించే ప్రయత్నం చేసారు. కానీ, అనూహ్యంగా రాజకీయ సన్యాసం ప్రకటించటం ద్వారా ఇక, రాజకీయాలకు పూర్తిగా దూరమైనట్లుగానే అందరూ భావించారు. కానీ, సమయం కలిసి వస్తే చిన్నమ్మ తిరిగి పొలిటికల్ గా యాక్టివ్ అవ్వటానికి సిద్దంగా ఉన్నారనే ప్రచారం కొనసాగుతోంది.