IND vs NAM టీ20 కెప్టెన్‌గా విరాట్ కోహ్లికి, కోచ్‌గా రవిశాస్త్రిలకు చివరి మ్యాచ్.. వారిద్దరూ ఏమన్నారంటే..

విరాట్ కోహ్లీ

భారత జట్టుకు కెప్టెన్‌గా ఉండటం తనకు దక్కిన గౌరవమని విరాట్ కోహ్లి అన్నాడు. నమీబియాతో మ్యాచ్‌కు ముందు మాట్లాడిన అతను జట్టు కెప్టెన్సీని మరొకరికి అప్పగించడానికి ఇదే సరైన సమయమని పేర్కొన్నాడు.

భారత టీ20 కెప్టెన్‌గా నమీబియాతో జరుగుతోన్న మ్యాచే విరాట్‌కు చివరిది. ఈ మ్యాచ్ అనంతరం టీ20 కెప్టెన్‌గా కోహ్లి తప్పుకోనున్నాడు. వరల్డ్ కప్ తర్వాత టీ20 కెప్టెన్‌గా వైదొలుగుతానని కోహ్లి సెప్టెంబర్‌లోనే ప్రకటించాడు.

''భారత కెప్టెన్సీ అతిపెద్ద గౌరవం. ఆ అవకాశం నాకు దక్కింది. కెప్టెన్‌గా నేను నా అత్యుత్తమ ఆటతీరును కనబరిచా. ఇప్పుడు దాన్ని మరొకరికి అప్పగించాల్సిన తరుణం వచ్చింది. జట్టు ఇప్పటివరకు ఆడిన తీరు పట్ల నేను చాలా గర్విస్తున్నా. ఈ జట్టు మరింత ముందుకు వెళ్లడానికి ఇదే సరైన సమయం. దీన్ని చూసుకోవడానికి ఇప్పుడు రోహిత్ ఉన్నాడు.''

''ఈ మ్యాచ్‌లో మొదట మేం బౌలింగ్ చేస్తాం. ఇక్కడ టాస్ చాలా కీలకంగా మారింది. కాబట్టి నేను ఇక్కడ రెండుసార్లు టాస్ గెలిచినప్పుడు... మేం ముందుగా ఏం చేయాలి అని నిర్ణయించుకున్నామో దాని ప్రకారమే నడుచుకున్నాం' అని కోహ్లి అన్నాడు.

'మంచి జట్టున్నా మేజర్ ట్రోఫీలు దక్కలేదు’

2017లో కోహ్లి పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. భారత హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి కూడా అదే సంవత్సరంలో నియమితులయ్యారు. శాస్త్రికి కూడా భారత కోచ్‌గా ఇదే చివరి టోర్నమెంట్.

రవిశాస్త్రి స్థానంలో భారత హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌ను బీసీసీఐ నియమించింది.

గణాంకాలను పరిశీలిస్తే కెప్టెన్‌గా విరాట్ కోహ్లి, కోచ్‌గా రవిశాస్త్రి అద్భుతంగా పనిచేసినట్లు తెలుస్తుంది. వారిద్దరి విజయాల శాతం చాలా మెరుగ్గా ఉంది అని మాజీ ఐపీఎల్ ప్లేయర్ అభిషేక్ జున్‌జున్‌వాలా అన్నారు.

''ఐసీసీ ట్రోఫీ గెలవకపోవడం కోహ్లికి నిరాశ కలిగిస్తుంది. కానీ ఎంఎస్ ధోని ఈ విషయంలో తనను తాను రుజువు చేసుకున్నాడు.''

''కోహ్లికి మంచి జట్టు లభించింది. మంచి జట్టున్నా మేజర్ ట్రోఫీలు దక్కకపోవడం అతనికి ప్రతికూలంగా మారింది. జట్టును కోహ్లి ముందుండి నడిపించాడు. ఫిట్‌నెస్ పరంగా భారత క్రికెట్‌కు కోహ్లి నాయకుడు. ఓవరాల్‌గా అతను చాలా మెరుగ్గా రాణించాడు'' అని ఆయన పేర్కొన్నారు.

విరాట్ కోహ్లీ, రవిశాస్త్రి

'ఆ క్రెడిట్ మొత్తం అతనికే దక్కాలి..’ - రవిశాస్త్రి

మరోవైపు, భారత కోచ్‌గా తనకు అద్భుతంగా గడిచిందని రవిశాస్త్రి అన్నారు. భారత కోచ్‌గా బాధ్యతలు స్వీకరించినప్పుడు తనదైన మార్పు చూపించాలని అనుకున్నట్లు శాస్త్రి చెప్పుకొచ్చారు.

''నేను అనుకున్నట్లే అన్నీ చేయగలిగాను. కొన్నిసార్లు జీవితంలో మనం ఏం సాధించామో అది ముఖ్యం కాదు... మనం దేన్ని అధిగమించామో అది ముఖ్యం. ఈ ఐదేళ్ల కాలంలో ఈ కుర్రాళ్లు దేన్ని అధిగమించారో అది ముఖ్యం. ప్రపంచంలోని అన్ని దేశాల్లో, అన్ని ఫార్మాట్లలో మా ప్రదర్శన... క్రికెట్ చరిత్రలోని గొప్ప జట్లలో మమ్మల్ని ఒకటిగా నిలుపుతుంది. అందులో నాకేలాంటి సందేహం లేదు.''

''అన్ని ఫార్మాట్లలోనూ మేం రాణించాం. ఎరుపు బంతితో ప్రపంచవ్యాప్తంగా విజయాలు సాధించాం. పరిమిత ఓవర్లలోనూ విదేశాలకు వెళ్లి అక్కడ వారిపై ఆధిపత్యం ప్రదర్శించాం. 'సొంతగడ్డపైనే భారత్ రాణించగలదు' అంటూ మమ్మల్ని అందరూ విమర్శించేవారు. కానీ ఈ జట్టు వాటికి సరిగ్గా బదులిచ్చింది.''

''రాహుల్ ద్రవిడ్ తన అనుభవంతో భారత క్రికెట్ స్థాయిని మరింతగా పెంచుతారు. నాయకుడిగా విరాట్ అద్భుతంగా పనిచేశాడు. టెస్టు క్రికెట్‌కు అంబాసిడర్‌గా వ్యవహరించాడు. టెస్టుల విషయంలో అతనికే ఈ క్రెడిట్ మొత్తం దక్కాలి.''

''నేను మానసికంగా అలసిపోయా. దానికి నా వయస్సు ప్రభావం కావచ్చు. కానీ ఈ కుర్రాళ్లు మాత్రం శారీరకంగా, మానసికంగా అలసిపోయారు. ఐపీఎల్‌కు ఈ టోర్నీకి మధ్య ఎక్కువ సమయముంటే బావుండేది. ఆరు నెలలు బబుల్‌లోనే గడపడం చాలా కష్టం. మాకు ఓడిపోతామనే భయం లేదు. ప్రతీ మ్యాచ్ గెలవడానికే ప్రయత్నిస్తే ఆటను కోల్పోతాం'' అని రవిశాస్త్రి చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+