విజయ్ కూ, తమకూ తేడా చెప్పిన స్టాలిన్..! డీఎంకే ఎమ్మెల్యేలకు కీలక టాస్క్..!
తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి ఘోర పరాజయం పాలవ్వడంతో పాటు కూటమికి నేతృత్వం వహించిన మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) కూడా ఓడిపోయారు. ఈ నేపథ్యంలో నిర్మాణాత్మక విపక్ష పాత్ర పోషిస్తామని ప్రకటించిన స్టాలిన్.. 24 గంటల్లోనే తమ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలకు కీలక టాస్క్ ఇచ్చారు. విజయ్ పార్టీ కంటే తాము కేవలం 3.52 శాతం ఓట్లతో వెనుకబడ్డామని వారికి స్టాలిన్ గుర్తుచేశారు.
తమిళనాడు ఎన్నికలలో డీఎంకే కూటమి అభ్యర్థులకు ఓటు వేసిన తమిళనాడు ప్రజలందరికీ హృదయపూర్వక, నిజాయితీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు స్టాలిన్ తెలిపారు. మీ ప్రతి ఒక్క ఓటును నేను అమూల్యమైన నమ్మకానికి చిహ్నంగా భావిస్తున్నానన్నారు. ఇప్పటివరకు అందిన ఓట్ల లెక్కింపు ప్రకారం, డీఎంకే కూటమి 1 కోటి 54 లక్షల 82 వేల 782 ఓట్లను సాధించిందని, ఈ ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ట్వీట్ చేశారు. అదనపు నియోజకవర్గాలను గెలుచుకున్న పార్టీ (విజయ్ టీవీకే) తమ కంటే కేవలం 17.43 లక్షల ఓట్లు మాత్రమే ఎక్కువగా పొందిందని, తమకూ, వారికి మధ్య ఓట్ల శాతం వ్యత్యాసం కేవలం 3.52 శాతం మాత్రమేనన్నారు.

తమిళనాడు ప్రజలు తమపై ఉంచిన నమ్మకం చాలా బలమైనదిగా భావిస్తున్నట్లు స్టాలిన్ తెలిపారు. తమకు ఓటు వేసిన ప్రజల వద్దకు నేరుగా వెళ్లి కృతజ్ఞతలు తెలియజేసే కర్తవ్యాన్ని తాము ఎల్లప్పుడూ నెరవేర్చామన్నారు. ఆ విషయంలో డీఎంకే తరపున గెలిచిన అభ్యర్థులందరూ వెంటనే తమకు ఓటు వేసిన ప్రజలను కలిసి కృతజ్ఞతలు తెలియజేయాలని స్టాలిన్ కోరారు. ప్రజాస్వామ్యంలో మన గౌరవానికి అర్హులు ప్రజలే అన్నారు. వారి కోసమే మనం పార్టీని నడుపుతున్నామని, వారి కోసమే మనం రాజకీయాల్లో పాల్గొంటున్నామని తెలిపారు. అందువల్ల, అభ్యర్థులందరూ వ్యక్తిగతంగా వెళ్లి ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేయాలన్నారు.

డీఎంకే గతంలో ఆరుసార్లు అధికారంలో ఉందని, తాము చూడని విజయం లేదని, తాము ఎదుర్కోని ఓటమి లేదని స్టాలిన్ తెలిపారు. రాజకీయ ప్రజా జీవితంలో, తమ సిద్ధాంతాన్ని నిలబెట్టే ప్రయాణంలో, తమ సిద్ధాంతం ఓటమిని చవిచూడకూడదనే విషయంలో ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉంటామన్నారు. గెలుపు ఓటములలో అయినా, వాటిని సమానంగా చూస్తూ తమ ఆదర్శాల వైపు ప్రయాణాన్ని కొనసాగించేవారే పార్టీ సహచరులు అన్నారు. అందుకే, ముఖ్యమైన సమావేశాలు , బహిరంగ సభలలో మాట్లాడినప్పుడల్లా, తమిళనాడు వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలందరికీ నివాళులర్పించడంతోనే ప్రారంభిస్తానన్నారు. మీరే ఈ ఉద్యమానికి ప్రాణం, మూలాలు అన్నారు.మీలో చాలామంది తనకు ఓదార్పు సందేశాలు పంపుతున్నారని,, మీ చేత సృష్టించబడి, మీ బలంతో బలం పుంజుకున్న తనకు, మీరు తోడుగా ఉన్నంత వరకు చింత ఎందుకన్నారు .అధికార పార్టీ అయితే ప్రజల కోసం పథకాలు రూపొందిస్తామని, ప్రతిపక్ష పార్టీ అయితే ప్రజల డిమాండ్ల కోసం పోరాడతామని తెలిపారు. ఆ క్రమంలో, ఇప్పుడు ఒక బలమైన ప్రతిపక్ష పార్టీగా ప్రజల కోసం రాజకీయాలను కొనసాగిస్తామన్నారు.















Click it and Unblock the Notifications