Omicron outbreak: భారత్-న్యూజిలాండ్ రెండో టెస్ట్పై గందరగోళం: మహారాష్ట్ర కీలక ఆదేశాలు
ముంబై: దక్షిణాఫ్రికాలో కొత్తగా పుట్టుకొచ్చిన ప్రాణాంతక కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. తీవ్ర భయాందోళనల్లో నెట్టేసింది. ఇదివరకు వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారికి సంబంధించిన డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్ల కంటే దీన్ని అత్యంత ప్రమాదకరమైనదిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించింది. అన్ని దేశాలను అప్రమత్తం చేసింది. ఫలితంగా- దక్షిణాఫ్రికా సహా, ఇతర ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి వచ్చే వారిపై అన్ని దేశాలు కఠిన ఆంక్షలు విధిస్తోన్నాయి.

కేంద్రం అప్రమత్తం..
వారిని క్వారంటైన్ చేస్తోన్నాయి. ఈ దిశగా సరికొత్త ప్రొటోకాల్స్ను విడుదల చేశాయి. భారత్ కూడా ఈ ఒమిక్రాన్ వేరియంట్ పట్ల అప్రమత్తమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారమే దేశ రాజధానిలో అత్యున్నత సమావేశాన్ని నిర్వహించారు. వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, కేంద్ర కేబినెట్ కార్యదర్శితో భేటీ అయ్యారు. ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ దేశంలో విస్తరించకుండా ఉండటానికి అవసరమైన అన్ని చర్యలను యద్ధ ప్రాతిపదికన తీసుకోవాలని ఆదేశించారు.

పలు రాష్ట్రాల్లో కొత్త కోవిడ్ ప్రొటోకాల్స్..
ఎప్పటికప్పుడు కొత్త కోవిడ్ ప్రొటోకాల్స్ను జారీ చేయాలని సూచించారు. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఒమిక్రాన్ వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, వైరస్ ప్రభావిత దేశాల నుంచి వచ్చే వారిని క్వారంటైన్ చేయాలని అన్నారు. ఈ పరిణామాల మధ్య కర్ణాటక, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఢిల్లీ వంటి రాష్ట్రాలు కొత్త కోవిడ్ ప్రొటోకాల్స్ను రూపొందించాయి. వాటిని తక్షణమే అమల్లోకి తీసుకొచ్చాయి.

ఆఫ్రికన్ దేశాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్..
ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతోన్న ఆఫ్రికన్ దేశాలకు ఆయా రాష్ట్రాల నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులు అధిక సంఖ్యలో ఉన్నందున.. తక్షణ చర్యలకు దిగాయి. పొరుగు రాష్ట్రాలతో సరిహద్దులను మూసివేశాయి. సరిహద్దుల్లో ప్రత్యేకంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేశాయి. రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులపై ఆంక్షలను విధించాయి. కరోనా వైరస్ నెగెటివ్ సర్టిఫికెట్ను తప్పనిసరిగా అందజేయాల్సి ఉంటుందని సూచించాయి.

మహారాష్ట్రలో మరింత కఠినం..
ప్రత్యేకించి- దక్షిణాఫ్రికా సహా ఇతర ఆఫ్రికన్ దేశాల నుంచి ముంబైకి రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉండటం వల్ల మహారాష్ట్ర ప్రభుత్వం తక్షణ నివారణ చర్యలను చేపట్టింది. ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికుడిని తాము క్వారంటైన్ చేస్తామని వెల్లడించింది. వారి శాంపిళ్లను పరీక్షల కోసం పంపిస్తామని, వాటి రిపోర్టులు అందిన తరువాతే.. ఇళ్లకు పంపిస్తామని ముంబై మేయర్ కిశోరి పెడ్నేకర్ తెలిపారు. కర్ణాటక, కేరళ, గుజరాత్ ప్రభుత్వాలు కూడా ఇదే తరహా ఆదేశాలను జారీ చేశాయి.

రెండో టెస్ట్పై ప్రభావం..
ముంబై క్రికెట్ అసోసియేషన్కు కూడా ఇవే ఆదేశాలను జారీ చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం. భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య ఆరంభం కాబోయే రెండో క్రికెట్ టెస్ట్ మ్యాచ్పై ఈ నియంత్రణ చర్యల ప్రభావం పడింది. డిసెంబర్ 3వ తేదీన ముంబైలోని వాంఖెడె స్టేడియంలో ఈ రెండు జట్ల మధ్య రెండో టెస్ట్ ఆరంభం కానుంది. వాంఖెడె స్టేడియం దీనికి వేదికగా మారింది. ఇంతకుముందు మ్యాచ్ను ప్రత్యక్షంగా తిలకించడానికి వందశాతం వరకు ప్రేక్షకులకు అనుమతి ఉండేది. దాన్ని తగ్గించింది మహారాష్ట్ర ప్రభుత్వం.

25 శాతానికి మాత్రమే అనుమతి..
వాంఖెడె స్టేడియం సీట్ల సామర్థ్యం 33 వేలు. 25 శాతం వరకు అంటే 7,500 మందికి ప్రేక్షకులకు మాత్రమే అనుమతి ఇచ్చింది. ఈ మేరకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ముంబై క్రికెట్ అసోసియేషన్కు నోటీసులను పంపించారు. న్యూజిలాండ్తో భారత క్రికెట్ జట్టు రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ను ఆడుతోన్న విషయం తెలిసిందే. తొలి టెస్ట్ మ్యాచ్.. ఉత్తర ప్రదేశ్ కాన్పూర్లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో నడుస్తోంది. ఇవ్వాళ నాలుగో రోజు మ్యాచ్ మొదలైంది.












Click it and Unblock the Notifications