Independence Day: ఎర్రకోటపై సరికొత్త చరిత్ర- స్వాతంత్రం వచ్చాక ఇదే తొలిసారి..!
స్వతంత్ర భారతావని 80వ సారి వేడుకలు జరుపుకునేందుకు సిద్ధమవుతోంది. ఎప్పటికప్పుడు తనను తాను మార్చుకుంటూ నవ భారతం ముందడుగు వేస్తున్న వేళ.. దేశంలో తాజాగా వినిపిస్తున్న జెన్ జీ యువ మంత్రం కేంద్రాన్ని సైతం కదిలించింది. దీంతో ఈసారి యువశక్తి ఇతివృత్తంతో స్వాతంత్ర దినోత్సవం (Independence day 2026) నిర్వహించుకోవాలని నిర్ణయించింది. దీంతో పాటు ఎర్రకోటపై పతాకావిష్కరణ వేడుకల విషయంలోనూ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
దేశంలో మొట్టమొదటిసారిగా ఆగస్టు 15న ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం (Vande Mataram) గీతాన్ని ఆలపించనున్నారు. ఇప్పటివరకూ జాతీయ గీతమైన జనగణమణను ఆలపిస్తుండగా.. దీని స్ధానంలో పూర్తి వందేమాతర గీతాన్ని ఆలపించాలని కేంద్రం నిర్ణయించింది. అలాగే 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో యువత శక్తి అందించే తోడ్పాటు ఈ కార్యక్రమం యొక్క ఇతివృత్తంగా ఉంటుందని కూడా కేంద్రం వెల్లడించింది. అయితే తాజాగా ఢిల్లీలో విద్యార్ధుల నిరసనల నేపథ్యంలో యువత ఇతివృత్రాన్ని తీసుకున్నట్లు జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో.. జంతర్ మంతర్ ఘటనల కంటే ముందే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం చెబుతోంది.

విజయ భారత్ దిశగా మన ప్రయాణంలో యువత ఒక కీలకమైన భాగమని, ఎందుకంటే వారు ఈ ప్రయాణానికి తోడ్పడటమే కాకుండా, దాని నుండి ప్రయోజనం పొందుతారని ఆశిస్తున్నామని, అదే ఈ ఇతివృత్తం తీసుకోవడానికి ఏకైక కారణమని రక్షణ శాఖ కార్యదర్శి ఆర్కే సింగ్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటకు చేరుకోగానే వందేమాతరం గీతాన్ని ఆలపిస్తారని, అనంతరం ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతిని ఉద్దేశించి సంప్రదాయబద్ధంగా ప్రసంగిస్తారని సింగ్ వెల్లడించారు. అనంతరం భారత వైమానిక దళానికి చెందిన ఎంఐ-17 హెలికాప్టర్, వందేమాతరం 150 ఏళ్ల స్మారక బ్యానర్ను మోసుకొచ్చి ఎర్రకోట వద్ద గుమిగూడిన ప్రజలపై పూల రేకులను కురిపిస్తుందని వెల్లడించారు.














Click it and Unblock the Notifications