భారత్ లో కొత్తగా 41,831 కరోనా కేసులు, 541 మరణాలు, ఆ రాష్ట్రాల్లో కేంద్రం అలెర్ట్
భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. రికవరీల కంటే కొత్త కేసులు ఎక్కువగా నమోదవుతున్న పరిస్థితి ఆందోళనకరంగా మారింది. భారతదేశంలో గత 24 గంటల్లో కొత్తగా 41,831 కేసులు నమోదయ్యాయి. 541 మంది కరోనాతో ప్రాణాలను పోగొట్టుకున్నారు. గత 24 గంటల్లో 39,258 మంది కరోనా నుండి కోలుకోగా, అంతకంటే ఎక్కువగా కొత్త కేసులు నమోదు కావడం ప్రస్తుతం దేశానికి ఆందోళన కలిగిస్తుంది.
Recommended Video
తాజాగా నమోదైన మరణాలతో కలిపి భారతదేశంలో మొత్తం మరణాల సంఖ్య 4,24,351 కి చేరుకుంది. ఇక దేశంలో ప్రస్తుతం కరోనా మహమ్మారి నుండి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 3,08 ,20,521 కి చేరింది. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 4,10,952 పెరిగి , క్రియాశీల కేసుల రేటు 1.30 శాతానికి చేరుకుంది. దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 10శాతానికి పైగా నమోదవుతున్న జిల్లాలలో కఠిన ఆంక్షలు అమలు చేయాలని రాష్ట్రాలకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సూచించింది.
దేశ వ్యాప్తంగా 46 జిల్లాలో పది శాతానికి పైగా, 53 జిల్లాలో 5 నుండి 10 శాతం మధ్య పాజిటివిటీ రేటు నమోదు అవుతున్నట్లుగా కేంద్రం స్పష్టం చేసింది. ఆయా రాష్ట్రాలను అలెర్ట్ చేసింది. అందులో దక్షిణాది రాష్ట్రాలే ఉండటం గమనార్హం.
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. నిన్న ఒక్కరోజే 60,15, 842 మందికి వ్యాక్సినేషన్ నిర్వహించారు. కరోనా థర్డ్ వేవ్ నుండి ప్రజలను కాపాడటానికి ,థర్డ్ వేవ్ తీవ్రతను తగ్గించడానికి వ్యాక్సినేషన్ ఒకటే మార్గమని ప్రపంచ ఆరోగ్య సంస్థ పదేపదే హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా పంపిణీ చేసిన మొత్తం వ్యాక్సిన్ డోసులు సంఖ్య 47,02,98,596 కు చేరుకుంది. ఇక గడచిన 24 గంటల్లో 17,89,472 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి.