భారత్ లో కరోనా కల్లోలం : గత 24 గంటల్లో 3,60,960 కొత్త కేసులు, 3వేలకు పైగా మరణాలతో విలయం
భారతదేశం కరోనా మహమ్మారి చేతిలో చిక్కి విలవిలలాడుతోంది. కరోనాను కట్టడి చేయడానికి కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టినా,ప్రపంచ దేశాలు భారత్ ను ఆదుకోవటానికి ముందుకు వస్తున్నా భారత్ లో కరోనా పరిస్థితిలో మాత్రం మార్పు లేదు. ప్రభుత్వం తీసుకుంటున్న కట్టడి చర్యలన్నీ బూడిదలో పోసిన పన్నీరుగానే మారుతున్నాయి.నిన్న కాస్త క్షీణించి నట్లు కనిపించిన కరోనా కేసులు మళ్లీ ఈ రోజు విపరీతంగా పెరిగాయి. ఎక్కడికక్కడ ప్రభుత్వాలు కఠిన ఆంక్షల దిశగా అడుగులు వేస్తున్నా పరిస్థితులలో మార్పు రావడం లేదు అన్నది స్పష్టంగా కనిపిస్తుంది.
Recommended Video
3 లక్షల 60 వేలకు పైగా కొత్త కరోనా కేసులతో భారత్
భారతదేశంలోగత 24 గంటల్లో 3,60,960 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో భారతదేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 17.99 మిలియన్లకు చేరుకుంది. గత 24 గంటల్లో కరోనా కారణంగా 3,293 మరణాలు నమోదయ్యాయని తెలుస్తుంది. దీంతో మహమ్మారి బారిన పడి మరణించిన వారి సంఖ్య 2,00,000 మార్కును దాటింది. మొత్తం కోవిడ్ -19 కేసుల దృష్ట్యా అమెరికా తర్వాత రెండవ స్థానంలో ఉన్న భారతదేశం, ఆరోగ్య మౌలిక సదుపాయాల కొరతను ఎదుర్కొంటుంది. గత వారం రోజులుగా రోజుకు 300,000 కొత్త కరోనా కేసులను నమోదు చేస్తోంది.
30 లక్షలకు చేరువగా కరోనా యాక్టివ్ కేసులు , 2 లక్షలు దాటిన మరణాలు
ప్రస్తుతం భారతదేశంలో కరోనా యాక్టివ్ కేసులు 29,78,709 వద్ద ఉన్నాయి. అంటే దాదాపు 30 లక్షలకు చేరువగా ఉన్నాయి. ఇది మొత్తం ధృవీకరించబడిన కేసులలో 16.34% గా ఉంది. భారతదేశంలో మూడు లక్షలకు పైగా కేసులు నమోదు కావడం ఇది వరుసగా ఏడవ రోజు. రోజువారీ మరణాల్లో రికార్డ్ బ్రేక్ సాధించిన నేటి మరణాలతో కలిపి,దేశం యొక్క మొత్తం మరణాల సంఖ్య 2,01,187 గా ఉంది. కరోనా మహమ్మారితో తీవ్ర ప్రభావితమైన రాష్ట్రమైన మహారాష్ట్రలో మంగళవారం 895 కొత్త కోవిడ్ మరణాలు నమోదయ్యాయి.
కేరళలో 255శాతం పెరిగిన యాక్టివ్ కేసులు , ఢిల్లీలోనూ లక్షకు చేరువగా యాక్టివ్ కేసులు
మహారాష్ట్ర తరువాత, కేరళ, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు మరియు ఢిల్లీలలోకరోనా కేసులు ఇప్పటివరకు నమోదయ్యాయి. గత జనవరిలో భారతదేశపు మొదటి కరోనావైరస్ కేసును నివేదించిన కేరళ, నిన్న మొదటిసారి 30,000 కొత్త కరోనా కేసులను నమోదు చేసింది. గత రెండు వారాల్లో కేరళ రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 255శాతం పెరిగిందని ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. గత 24 గంటల్లో ఢిల్లీలో కోవిడ్ బారినపడి 381 మంది మరణించారు. ఇది ఇప్పటివరకు రాజధానిలో ఒక్క రోజులో నమోదైన నమోదైన అత్యధిక మరణాల సంఖ్య. ఢిల్లీలో కొత్త కేసులు 24,149 గా ఉంది .క్రియాశీల కేసుల సంఖ్య 98,000 కు పైగా ఉంది. పాజిటివిటీ రేటు 32.72 శాతంగా ఉంది.
ప్రజల్లో అప్రమత్తత అవసరం .. కరోనా మహమ్మారి కట్టడి సమిష్టి బాధ్యత
లక్షల కొద్దీ కేసులు నమోదు కావడం, వేలల్లో మరణాలు సంభవించడం భారతదేశాన్ని దారుణ పరిస్థితులు వైపు నడిపిస్తున్నాయి.తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాలు భారతదేశం ఎంత ఆరోగ్య సంక్షోభంలో పడిందో అందరికీ అర్థమయ్యేలా చెబుతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రభుత్వాల ప్రయత్నాలే కాకుండా, ప్రజల సహకారం కూడా అవసరమని, సమిష్టిగా కరోనా సెకండ్ వేవ్ ను జయించాలని ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ప్రజలు కరోనా నిబంధనలను పాటించి మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వాలు పదేపదే కోరుతున్నాయి. లేదంటే ఇప్పటికే చాలా వరకు ప్రజలను కాపాడుకోలేకపోతున్న పరిస్థితులు మరింత పెరిగి భారత్ పరిస్థితి అత్యంత దారుణంగా తయారయ్యే ప్రమాదం ఉంది.