పాక్ పని ఫినిష్: ఇక సర్జికల్ స్ట్రైక్ డ్రోన్లు
న్యూఢిల్లీ: పాక్ అక్రమిత కాశ్మీర్ లో భారత సైనికులు సర్జికల్ స్ట్రైక్ దాడులు చేసి ఉగ్రవాదుల అంతం చూసిన విషయం తెలిసిందే. ఈ సర్జికల్ స్ట్రైక్ దాడుల్లో ఉగ్రవాదుల అంతం చూశారు. ఇలాంటి ఘటనల్లో పాక్ వైపు నుంచి కూడా ప్రతిదాడి జరిగితే ఏమి చెయ్యాలి అని అధికారులు ఆలోచించారు.
ఇదే జరిగితే భారత సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అయినప్పటికీ మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో సైనికులు తమ ప్రాణాలకు తెగించి పాక్ ఉగ్రవాదులు, శత్రువులతో పోరాడుతున్నారు. అయితే, ఇకపై సైనికుల ప్రాణాలను పణంగా పెట్టకుండానే శత్రువులను తుదముట్టించే అత్యాధునిక సర్జికల్ స్ట్రైక్ డ్రోన్లను సరిహద్దుల్లో మోహరించాలని భారత వాయుసేన నిర్ణయించింది.
భారత సైనికుల చుక్క రక్తం నేల రాలకుండా శత్రువులపై విజయం సాధించేందుకు డ్రోన్లను వినియోగించాలని యోచిస్తోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ ఇప్పటికే రూపొందించిన మానవ రహిత ఏరియల్ వెహికల్స్ను మరింత ఆధునీకరించి సర్జికల్ స్ట్రైక్ డ్రోన్లుగా మార్చాలని ఐఏఎఫ్ వర్గాలు భావించాయి.
ఇలా చేస్తే భారత సైనికుల బలిదానాలను తగ్గించే అవకాశం ఉంటుందని ఐఏఎఫ్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ డ్రోన్లు అందుబాటులోకి వస్తే ప్రస్తుతం సైనికులు చేస్తున్న అన్ని పనులూ డ్రోన్లు చేస్తాయని, సరిహద్దుల్లో నిఘా వ్యవస్థ సమూలంగా మారిపోతుందని ఐఏఎఫ్ అధికారులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో సర్జికల్ స్ట్రైక్ డ్రోన్ల అభివృద్ధికిగాను ఇజ్రాయెల్తో కలిసి పనిచేయ్యాలని ఐఏఎన్ అధికారులు భావిస్తున్నారు. ఇటీవల పాక్ ఆక్రమిత కశ్మీర్ (ఎల్ వోసీ) వెంబడి ఉన్న ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేయడంలో భారత సైన్యం చేసిన కృషిని ఇకపై ఈ డ్రోన్లు నిర్వహిస్తాయని ఐఏఎఫ్ అధికారులు తెలిపారు.
ఈ సర్జికల్ స్ట్రైక్ డ్రోన్లను ప్రాజెక్టు చీతా పేరుతో అభివృద్ధి పరచనున్నారు. దీనికిగాను సుమారు రూ.10,000 కోట్లు ఖర్చు అవుతాయని అధికారులు అంచనా వేశారు. ఈ డ్రోన్ల ఫలితంగా అత్యంత కఠినమైన లక్ష్యాలను సైతం చేరుకునే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.
కనీసం 30,000 అడుగుల ఎత్తు నుంచి లక్ష్యాలను ఛేదించవచ్చునని, శత్రువులు ఈ విషయాన్ని ఎలాంటి పరిస్థితిలో పసిగట్టే అవకాశం కూడా ఉండదని అధికారులు వివరించారు. ఉరీ సెక్టార్ తో సహా పాక్ సరిహద్దుల వెంబడి ఈ సర్జికల్ స్ట్రైక్ డ్రోన్లను మోహరించే ప్రణాళిక ఉందన్నారు.
ఇప్పటి వరకు కేవలం అమెరికా మాత్రమే ఈ తరహా డ్రోన్ల వ్యవస్థను అమలు చేస్తోందని అధికారులు చెప్పారు. ఇప్పుడు భారత్ ఈ టెక్నాలజీని అమలు చేస్తే పాక్ ఉగ్రవాదులతో సహ అక్కడి ఆర్మీ ఆగడాలకు కళ్లేం వేసే అవకాశం ఉందని రక్షణ శాఖ నిపుణలు అంటున్నారు.