కరోనా కేసులు తగ్గుముఖం - పెరుగుతున్న మరణాలు : 15.77 శాతం పాజిటివిటీ రేటు..!!
దేశ వ్యాప్తంగా ఈ నెల ప్రారంభం నుంచి వణికించిన కరోనా కేసుల సంఖ్య క్రమేణా తగ్గుతోంది. వరుసగా మూడు లక్షలకు పైగా నమోదైన కేసులు దిగి వస్తున్నాయి. అయితే, గతం కంటే మరణాల సంఖ్య పెరగటం ఆందోళనకు కారణమవుతోంది. తాజాగా.. ఒక్కరోజులో.. 2,09,918 కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య రోజురోజుకూ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మహమ్మారి కారణంగా ఆదివారం మరో 959 మంది మరణించారు. 2,62,628 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 15.77 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
క్రమేణా తగ్గుముఖం
దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 4,13,02,440 కాగా, మొత్తం మరణాలు 4,95,050 గా నిర్దారించారు. ఇక, యాక్టివ్ కేసులు 18,31,268 గా వెల్లడించిన ఆరోగ్య శాఖ, ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,89,76,122గా నిర్దారించింది. ఇక, దేశ వ్యాప్తంగా టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. ఆదివారం 28,90,986 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 166,03,96,227కు చేరింది. తీవ్రంగా ప్రభావం చూపిన రాష్ట్రాల్లోనూ కేసుల సంఖ్య క్రమేణా తగ్గుతోంది. మహారాష్ట్ర..ఢిల్లీ..కర్ణాటక వంటి రాష్ట్రాల్లో పరిస్థితి మెరుగుపడుతోంది.
తెలుగు రాష్ట్రాల్లోనూ అదుపులోకి
ఇక, తెలుగు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నా..తీవ్రత తక్కువగానే ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. తలెంగాణలో గడచిన 24 గంటల్లో 65,263 కరోనా పరీక్షలు చేయగా... 2,484 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,045 కొత్త కేసులు నమోదు కాగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 138, రంగారెడ్డి జిల్లాలో 130, నల్గొండ జిల్లాలో 108, ఖమ్మం జిల్లాలో 107 కేసులు గుర్తించారు. అదే సమయంలో 4,207 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. దీంతో.. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,086కి పెరిగింది.
Recommended Video
కేంద్రం తాజా మార్గదర్శకాలు
ఇక, ఏపీలో 10,310 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటలలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి వల్ల 12 మంది మరణించారు. కాగ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 9,692 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలోప్రస్తుతం 1,16,031 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. కరోనా ఆంక్షలు కొనసాగుతున్నాయి. కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న జిల్లాల్లో ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేస్తోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ రికార్డు స్థాయిలో కొనసాగుతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు.