భారీగా తగ్గిన కరోనా కేసులు, మరణాలు: పాజిటివిటీ రేటు పతనం, 20లక్షల దిగువకు యాక్టివ్ కేసులు
న్యూఢిల్లీ: దేశంలో సెకండ్ వేవ్లో మార్చి నెల నుంచి, ఏప్రిల్, మే నెలల్లో విజృంభించిన కరోనావైరస్ మహమ్మారి మే నెల చివరి నుంచి తగ్గుముఖం పట్టింది. గత కొద్ది రోజుల నుంచి క్రమంగా కరోనా కేసులు, మరణాలు తగ్గుకుంటూ వస్తున్నాయి. తాజాగా, దేశంలో కొత్తగా నమోదైన కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది, మరణాల సంఖ్య కూడా తగ్గడం గమనార్హం. అదే సమయంలో కోలుకుంటున్నవారి సంఖ్య ఎక్కువగా ఉండటం ఊరటనిచ్చే అంశం.
దేశంలో కొత్తగా 1,27,510 కరోనా కేసులు
గత 24 గంటల్లో దేశంలో 19,25,374 మంది నమూనాలను పరీక్షించగా.. 1,27,510 మందికి కరోనా సోకినట్లు తేలింది. గత 54 రోజుల్లో ఇదే కనిష్టం కావడం గమనార్హం. దీంతో ఇప్పటి వరకు దేశంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,81,75,044కు చేరింది. అంతకుముందు రోజుతో పోల్చుకుంటే 16 శాతం తగ్గుదల నమోదు కావడం గమనార్హం. వరుసగా ఐదో రోజు కూడా కేసులు తగ్గుముఖం పట్టాయని కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడించాయి.
దేశంలో 3వేల దిగువనే మరణాలు
ఒక్కరోజు వ్యవధిలో 2795 మంది కరోనా బారినపడి మరణించారు. గత నెల రోజులుగా భారీగా కరోనా మరణాలు నమోదవుతుండగా.. తాజాగా 3వేల లోపే మరణాలు సంభవించడం గమనార్హం. దీంతో ఇప్పటి వరకు దేశంలో కరోనాతో మరణించినవారి సంఖ్య 3,31,895కు చేరింది. మరోవైపు కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో యాక్టివ్ కేసుల్లో తగ్గుదల కనిపించింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు కరోనా కట్టడికి నిబంధనలను కఠినంగా అమలు చేయడం, లాక్డౌన్, కర్ఫ్యూలను విధించడంతో కరోనా కేసులు దిగివస్తున్నట్లు తెలుస్తోంది.
దేశంలో భారీగా పెరిగిన రికవరీలు
గత 24 గంటల వ్యవధిలో 2,55,287 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 2.59 కోట్ల మందికిపైగా కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడ్డారు. రికవరీ రేటు 91.60 శాతానికి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 18,94,520 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. పాజిటివిటీ రేటు 7.22 శాతంగానికి క్షీణించింది. ఇది ఇలావుండగా, సోమవారం 27,80,058 మందికి కరోనా టీకాలు వేశారు. ఇప్పటి వరకు 21,60,46,638 మందికి కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు.