భారత్లో 15లక్షల మార్క్ దాటిన కరోనా కేసులు... లక్ష నుంచి 1.5మిలియన్లకు ఎన్ని రోజులు పట్టిందంటే?
భారత్లో ఇవాళ కొత్తగా 28,652 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 15,06,380కి చేరింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం ఈ వివరాలను వెల్లడించవచ్చు. కరోనా దేశాల జాబితాలో ప్రస్తుతం 4.2మిలియన్ల కేసులతో అమెరికా మొదటి స్థానంలో ఉండగా... 2.4మిలియన్ల కేసులతో రెండో స్థానంలో బ్రెజిల్,1.5 మిలియన్ల కేసులతో మూడో స్థానంలో భారత్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 6,54,860 మంది మృత్యువాత పడ్డారు.

181 రోజులు...
భారత్లో రికవరీ రేటు మెరుగ్గా ఉందని కేంద్రం చెప్తున్న లెక్కలు ఊరట కలిగిస్తున్నప్పటికీ... దేశంలో ఇప్పటికీ కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొనడం ఆందోళన కలిగిస్తోంది. గత కొద్దిరోజులుగా భారత్లో ప్రతీరోజూ అటు ఇటుగా 50వేల కరోనా కేసులు నమోదవుతూ వస్తున్నాయి. మే 1న భారత్ లక్ష మార్క్ని చేరుకోగా... 15లక్షల మార్క్ చేరుకోవడానికి 181 రోజులు పట్టడం గమనార్హం.

ఇలాగే కొనసాగితే...
తాజా కరోనా కేసుల గణాంకాలను పరిశీలిస్తే... అమెరికాలో ఏడు రోజుల సగటు 1.7శాతం,బ్రెజిల్లో 2.4శాతం ఉండగా.. భారత్లో 3.6శాతం ఉండటం గమనార్హం. కేసుల సంఖ్య ఇదే తరహాలో కొనసాగితే రాబోయే రెండు నెలల్లో భారత్ అమెరికాను దాటేసే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం... మిగతా ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత పరిస్థితి మెరుగ్గా ఉందని పేర్కొనడం గమనార్హం. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్లే భారత్ కరోనాను తట్టుకోగలిగిందని చెప్పారు.

ఆ 3 రాష్ట్రాల్లో తగ్గిన కేసులు...
మంగళవారం(జూలై 28) ఉదయం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం గడిచిన 24గంటల్లో దేశంలో 47,703 కరోనా కేసులు నమోదయ్యాయి. సోమవారం 49వేల పైచిలుకు కేసులు నమోదవగా... మంగళవారానికి కేసుల సంఖ్య కాస్త తగ్గింది. ఢిల్లీ,ఆంధ్రప్రదేశ్,మహారాష్ట్రల్లో కేసుల్లో సంఖ్య తగ్గడమే ఇందుకు కారణం. సోమవారంతో పోలిస్తే మంగళవారం ఢిల్లీలో 42శాతం మేర కేసులు తగ్గాయి. ఆంధ్రప్రదేశ్లో 20శాతం మేర,మహారాష్ట్రలో 16శాతం మేర కేసులు తగ్గాయి. గత రెండు రోజులుగా దేశంలో ప్రతీరోజూ 5లక్షల పైచిలుకు కరోనా టెస్టులు చేయడం గమనార్హం.












Click it and Unblock the Notifications