కరోనా తీరులో అదే జోరు: దేశంలో 78 వేల మంది బలి: భయపెడుతోన్న కొత్త కేసులు
న్యూఢిల్లీ: కరోనా వైరస్.. దిగట్లేదు. అదుపులోకి రావట్లేదు. ప్రారంభంలో 40 నుంచి 45 వేల మధ్యలో నమోదవుతూ వచ్చిన కరోనా వైరస్ రోజువారీ పాజిటివ్ కేసులు.. కాలం గడిచే కొద్దీ పైపైకి వెళ్తున్నాయే తప్ప దిగిరావట్లేదు. రోజూ పుట్టుకొస్తోన్న కొత్త కేసుల సంఖ్య ప్రస్తుతం 90 వేలకు పైగా కొనసాగుతోంది. గరిష్ఠంగా 96 వేల మార్క్ను అందుకున్న కరోనా కేసుల ఉధృతిలో ఏ మాత్రం వేగం తగ్గట్లేదు. కొత్తగా దేశవ్యాప్తంగా 94 వేలకు పైగా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. మరణాల సంఖ్యలోనూ మార్పు ఉండట్లేదు.
దేశవ్యాప్తంగా రోజూ 1100లకు పైగా మృత్యువాత పడుతూనే ఉన్నారు. దేశంలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 94,372 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 1,114 మంది మరణించారు. దీనితో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 47,54,357కు చేరుకుంది. ఇప్పటిదాకా 78,586 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 9,73,175కు చేరుకుంది. 37,02,596 మంది డిశ్చార్జి అయ్యారు.

దీనికి సంబంధించిన వివరాలతో కూడిన తాజా బులెటిన్ను కొద్దిసేపటి కిందటే కేంద్ర వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు విడుదల చేశారు. కొద్దికాలం నుంచి 1100లకు పైగా కరోనా మరణాలు రికార్డవుతున్నాయి. డిశ్చార్జీల్లోనూ భారీగా పెరుగుదల కనిపిస్తోంది. 24 గంటల్లో కొత్తగా 78,399 మంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. ఇళ్లకు తిరిగివెళ్లారు. ఇదివరకటి సంఖ్యతో పోల్చుకుంటే.. రోజువారీ రికవరీ కేసుల్లో 3,134 తగ్గుదల కనిపించింది. యాక్టివ్ కేసులు 14,859 పెరుగుదల నమోదైంది.
Recommended Video
రాష్ట్రాల్లో అనూహ్య సంఖ్యలో పుట్టుకొస్తోన్న కొత్త కేసుల వల్ల దేశవ్యాప్తంగా లక్ష వరకు రోజువారీ లెక్కలు నమోదవుతున్నాయి. దేశంలో కరోనా వైరస్ పరీక్షలు రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి. శనివారం వరకూ నిర్వహించిన కరోనా టెస్టుల సంఖ్య అయిదున్నర కోట్లను దాటుకుంది. ఇప్పటిదాకా 5,62,60,928 శాంపిళ్లను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) వెల్లడించింది. శనివారం ఒక్కరోజులో 10,71,702 కరోనా శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.












Click it and Unblock the Notifications