ఈ ఏడాది వానా కాలంలో 101 శాతం వర్షపాతం-వాతావరణ శాఖ తాజా అప్డేట్
దేశంలో ఈ ఏడాది వానా కాలానికి(జూన్-సెప్టెంబర్) సంబంధించి భారత వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. మునుపటి అంచనా కంటే ఎక్కువ వర్షపాతాన్ని అంచనా వేస్తున్నట్లు వెల్లడించింది. జూన్-సెప్టెంబర్ మాసాల్లో దీర్ఘ కాల సగటు 88 సెం.మీతో 101 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అంతకుముందు,ఏప్రిల్ 16 నాటి అంచనాలో ఇది 98 శాతంగా పేర్కొంది.
ఈసారి వానాకాలంలో ఈశాన్య భారతంలో 5 శాతం తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు ఐఎండీ అంచనా వేసింది. మధ్య భారతంలో 6 శాతం అధిక వర్షపాతం నమోదవుతుందని... వాయువ్య భారతంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది.
'ఈ ఏడాది మంచి వర్షపాతాన్ని అంచనా వేస్తున్నాం. ముఖ్యంగా వ్యవసాయ ప్రధానంగా ఉండే మధ్యభారతంలో ఎక్కువ వర్షపాతం నమోదవవచ్చు.' అని ఐఎండీ డైరెక్టర్ మోహపాత్ర తెలిపారు.
మే 31న నైరుతి రుతు పవనాలు కేరళ రాష్ట్రాన్ని తాకుతాయని ఇటీవల వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే కేరళ తీర ప్రాంతంలో ఈదురు గాలుల ప్రభావంతో జూన్ 3 నాటికి నైరుతి రుతు పవనాలు వచ్చే అవకాశం ఉందని మరో ప్రకటన విడుదల చేసింది. పసిఫిక్ మహాసముద్రంతో పాటు హిందూ మహాసముద్రంపై ఉపరితల ఉష్ణోగ్రత (ఎస్ఎస్టీ) పరిస్థితులు రుతుపవనాలపై బలమైన ప్రభావాన్ని చూపుతున్నందునా... వాటిని జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది.
భారత్లో దాదాపు సగం వ్యవసాయ భూములకు నీటిపారుదల లేదు. వరి,మొక్కజొన్న,చెరుకు,పత్తి,సోయాబీన్ వంటి పంటలకు జూన్-సెప్టెంబర్ వర్షాపాతమే ఆధారం. ఈసారి వర్షాలు ఎక్కువగా కురిస్తే ఈ పంటలు వేసిన రైతులకు మేలు జరగనుంది.