1963 నుంచీ అక్రమ ఆక్రమణలే! సార్వభౌమాధికారమంటూ మాకే పాఠాలా..?
భారత సార్వభౌమాధికారంపై చైనా చేస్తున్న తప్పుడు ప్రకటనలను, అవాస్తవ ప్రచారాన్ని భారత్ అత్యంత ఘాటుగా తోసిపుచ్చింది. ఇటీవల మనీలాలో జరిగిన ఆసియాన్ సదస్సు వేదికగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీల మధ్య భేటీ జరిగింది. అయితే ఈ సమావేశం తర్వాత డ్రాగన్ దేశం విడుదల చేసిన ప్రకటనలో జైశంకర్ అనని మాటలను అన్నట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. దీనిపై మన విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చైనా సార్వభౌమాధికారానికి భారత్ ఎప్పుడూ భంగం కలిగించలేదని, కానీ చైనా మాత్రం భారత్ కు చెందిన ప్రాంతాల్లో అక్రమంగా పాగా వేసి ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోందని స్పష్టం చేశారు.

1963 నుంచీ అక్రమ ఆక్రమణలే!
జమ్మూకశ్మీర్, లద్దాఖ్లలోని భారత భూభాగాలను చైనా 1963 నుంచి అక్రమంగా ఆక్రమించి ఉంచిందనే నిజ తీవ్రతను భారత్ ప్రపంచం ముందు మరోసారి ఉంచింది. చైనా అక్రమంగా ఆక్రమించిన ప్రాంతాలు నిస్సందేహంగా భారత్కు చెందినవేనని, ఆ విషయాన్ని స్వయంగా చైనా కూడా గుర్తించిందని జైస్వాల్ గుర్తుచేశారు. అటువంటి భారత భూభాగాల్లో చైనా ఏకపక్షంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోందని తెలిపారు. సార్వభౌమాధికార అంశాల గురించి మాట్లాడే హక్కు చైనాకు ఎంతమాత్రం లేదని, అసలైన బాధితురాలిగా ఆ ప్రశ్నలు అడిగే హక్కు భారత్కే ఉందనే విషయాన్ని సగర్వంగా పునరుద్ఘాటించారు.
ద్వైపాక్షిక సంబంధాలపై డ్రాగన్ తీపి మాటలు
మరోవైపు చైనా మాత్రం తమ ప్రకటనల్లో తీపి మాటలు గుమ్మరించే ప్రయత్నం చేసింది. ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ల మధ్య జరిగిన గత భేటీలు ఇరుదేశాల బంధాన్ని సరైన మార్గంలో పెట్టాయని వాంగ్ యీ వ్యాఖ్యానించినట్లు చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. భారత్-చైనాలు ఒకరికొకరు పోటీదారులు కాదని, భాగస్వాములని వ్యాఖ్యానించింది. సరిహద్దుల్లో శాంతి నెలకొనడం, ద్వైపాక్షిక వాణిజ్యం మునుపెన్నడూ లేనంతగా పెరగడం సంతోషకరమని పేర్కొంది. గ్లోబల్ సౌత్ విభాగంలో ఇరు దేశాలు బాధ్యతాయుతమైన శక్తిగా ముందుకెళ్లాలని చైనా కోరింది.
మాటలు కావు.. చేతలు కావాలి!
చైనా ఎన్ని శాంతి వచనాలు పలికినా, తమ సరిహద్దు భూభాగాల్లో చైనా సాగిస్తున్న దురాక్రమణలను భారత్ ఎంతమాత్రం సహించేది లేదని స్పష్టం చేసింది. తైవాన్తో సహా చైనా సార్వభౌమాధికార అంశాలకు భారత్ మద్దతు ఇస్తోందంటూ చైనా మీడియా వ్యాప్తి చేస్తున్న వార్తలను కేంద్ర విదేశాంగ శాఖ ఖండించింది. పొరుగున ఉన్న రెండు పెద్ద దేశాలు పరస్పర గౌరవంతో మెలిగితేనే బంధం సజావుగా సాగుతుందని, కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా చైనా తన చొరబాట్లను ఆపాలని భారత్ సూటిగా హెచ్చరించింది.












Click it and Unblock the Notifications