భారత్ కు చేరుకున్న S- 400 రక్షణ వ్యవస్థ.. చైనా, పాకిస్థాన్ అలర్ట్..!
దేశ వైమానిక రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడంలో భాగంగా, రష్యా తయారీకి చెందిన ఎస్-400 సుదర్శన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ నాలుగో స్క్వాడ్రన్ భారత్ కు చేరుకుంది. ఈ క్షిపణి వ్యవస్థ నౌక ద్వారా భారత్కు చేరిందని, త్వరలోనే వీటిని నిర్ణీత ఆపరేషనల్ ప్రాంతాల్లో మోహరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని రక్షణ వర్గాలు వెల్లడించాయి.
ఈ పరికరాలు 2018లో రష్యాతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా వస్తున్నాయి. అప్పట్లో ఐదు స్క్వాడ్రన్ల కొనుగోలుకు భారత్ ఒప్పందం చేసుకోగా, ఇప్పటికే రెండేళ్ల క్రితం మూడు స్క్వాడ్రన్లు భారత్కు చేరాయి. అయితే, రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా మిగిలిన రెండు స్క్వాడ్రన్ల సరఫరాలో కొంత జాప్యం ఏర్పడింది.
గతంలో జరిగిన ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్ వైమానిక దళం యొక్క సామర్థ్యాలను దెబ్బతీయడంలో సుదర్శన్ వ్యవస్థ కీలక పాత్ర పోషించింది. సుమారు 300 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ప్రయాణిస్తున్న పాక్ నిఘా విమానాన్ని కూల్చివేసి, అత్యంత సుదూర ప్రాంతం నుంచి సర్ ఫేస్-టు-ఎయిర్ క్షిపణి లక్ష్యాన్ని ఛేదించిన అరుదైన రికార్డును ఇది నమోదు చేసింది.
ఐదో స్క్వాడ్రన్ విషయంలోనూ స్పష్టత వచ్చింది; ఇది వచ్చే కొద్ది నెలల్లోనే భారత్కు చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. భవిష్యత్తు రక్షణ వ్యూహాలను దృష్టిలో ఉంచుకుని, కొత్తగా మరో ఐదు ఎస్-400 స్క్వాడ్రన్లను కొనుగోలు చేయడానికి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (DAC) ఇప్పటికే ఆమోద ముద్ర వేసింది.

రష్యన్ వ్యవస్థకు ధీటుగా, శత్రువుల డ్రోన్లను కూల్చివేసేలా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో 'ప్రాజెక్ట్ కుషా'ను భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ ప్రాజెక్టులో భారతీయ రక్షణ రంగ సంస్థ 'సొలార్ ఇండస్ట్రీస్' డెవలప్మెంట్ కం ప్రొడక్షన్ భాగస్వామిగా ఉంటూ, దేశీయ వ్యవస్థ తయారీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తోంది.












Click it and Unblock the Notifications