Indo-Pak War: యుద్ధం దిశగా మరో అడుగు- రేపు పాకిస్తాన్ సరిహద్దుల్లో విమానాలు ...!
కాశ్మీర్ లో జరిగిన పహల్గాం తీవ్రవాద దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ సర్వసన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా తమ పౌరుల్ని యుద్దం వస్తే ఎలా స్పందించాలన్న దానిపై రేపు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తోంది. అదే సమయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం రేపు పాకిస్తాన్ సరిహద్దుల్లో యుద్ద విమానాలు భారీ ఎత్తున విన్యాసాలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి.
రేపు పాకిస్తాన్ కు సమీపంలోని రాజస్థాన్ సరిహద్దుల్లో భారత వాయుసేన విమానాలు సైనిక విన్యాసాలు చేపట్టబోతున్నాయి. రేపు ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సైనిక విన్యాసాలు ఐదున్నర గంటల పాటు భారీ ఎత్తున సాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రేపు సరిహద్దులకు సమీపంలోని ఎయిర్ పోర్టులకు విమానాల రాకపోకల్ని కూడా నిలిపివేస్తున్నారు. అలాగే ఎయిర్ మెన్లకు కూడా రేపు విన్యాసాలకు హాజరు కావాలని ఆదేశాలు వెళ్లాయి.

ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమావేశమయ్యారు. గత 48 గంటల్లో వీరిద్దరు భేటీ కావడం ఇది రెండోసారి. ఇవాళ జరిగిన భేటీ తర్వాత పాకిస్తాన్ పై యుద్ధ సన్నాహాల్ని భారత్ ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇలా వాయుసేన యుద్ద విమానాలతో విన్యాసాలు నిర్వహించేందుకు సిద్దమైంది. అదే సమయంలో రేపు దేశవ్యాప్తంగా దాదాపు 300 ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించేందుకు బలగాలు సిద్ధమయ్యాయి.
పాకిస్తాన్ పై భారత్ సైనిక దాడి తప్పదన్న అంచనాలు దీంతో మరింత బలపడుతున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ కు చెందిన పలువురు రాజకీయ నేతలు, అధికారులు తమకు భారత్ దాడి చేస్తుందన్న పక్కా నిఘా సమాచారం ఉందని చెప్తున్నారు. అలాగే భారత్ వైపు నుంచి దాడి జరిగితే ఏం చేయాలన్న దానిపై పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి పౌరుల వరకూ అందరూ ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications