కూలిన భారత నావికా యుద్ద విమానం: ఇద్దరు గల్లంతు
గోవా: భారత నావికా దళానికి చెందిన యుద్ద విమానం (ఎయిర్ క్రాఫ్ట్) ప్రమాదవశాత్తు కూలిపోయిన సంఘటన గోవాలోని పనాజి తీరంలో జరిగింది. భారత నావికా దళానికి చెందిన పరిశీలకుడు, యుద్ద విమానం పైలట్ ఇద్దరు గల్లంతయ్యారు. ఈ ప్రమాదం నుండి ఒక అధికారి ప్రాణాలతో బయటపడ్డారు.
నావికా దళం అధికారులు సాటి సిబ్బిందికి పైలెట్ శిక్షణ, సముద్ర తీరంలో గస్తీలకు సంబంధించిన శిక్షణ ఇస్తుంటారు. ఎప్పటిలాగే మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో యుద్ద విమానంలో ముగ్గురు అధికారులు బయలుదేరారు. సౌత్-వెస్ట్ గోవాలోని 25 నాటికల్ మైళ్ల తీరంలో యుద్ద విమానం ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. తరువాత యుద్ద విమానం కూలిపోయిందని అధికారులు నిర్దారించుకున్నారు.
యుద్ద విమానం నుండి సంబంధాలు తెగిపోవడంతో నావికాదళ అధికారులు ఆందోళన చెందారు. యుద్ద విమానం నుండి ఒకరు క్షేమంగా బయటపడ్డారు. గల్లంతు అయిన ఇద్దరు అధికారుల కోసం నావికా దళం అధికారులు గాలిస్తున్నారు. యుద్ద విమానం కూలిపోవడానికి కచ్చితమైన కారణాలు తెలియడం లేదని అధికారులు అంటున్నారు.