ముగ్గురు భర్తల సమక్షంలో విచారణ: ఇంద్రాణి ఏడ్పు
ముంబై: కూతురు షీనా బోరాను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఇంద్రాణి ముఖర్జియాను ఆమె ముగ్గురు భర్తల సమక్షంలో ముంబై పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మొత్తం కుటుంబమంతా ఖార్ పోలీస్స్టేషన్లో ఉంది. ఇంద్రాణి ప్రస్తుత భర్త పీటర్ ముఖర్జియాను పోలీసులు మూడోసారి ప్రశ్నిస్తున్నారు. ఇంద్రాణి ముఖం చూడడానికి కూడా పీటర్ ముఖార్జియా ఇష్టపడలేదని అంటున్నారు. అయితే విచారణ కోసం తప్పలేదని సమాచారం.
ఇంద్రాణి రెండో భర్త సంజీవ్ ఖన్నాను ఇప్పటికే పలుమార్లు ప్రశ్నించారు. షీనా, మిఖాయిల్ల తండ్రిగా భావిస్తోన్న సిద్ధార్థ్ దాస్ను కూడా ఖార్ పోలీస్ స్టేషన్లో ప్రశ్నిస్తున్నారు. ఆయన డిఎన్ఏను కూడా సేకరించారు. షీనా డిఎన్ఏతో పోల్చి చూసాత్రు. ఇంద్రాణి ముఖర్జీకి సంజీవ్ ఖన్నా ద్వారా జన్మించిన విధి కూడా పోలీస్ స్టేషన్కు చేరుకుంది. విధికి ఆస్తి దక్కదన్న అక్కసుతోటే సంజీవ్ ఖన్నా షీనాను చంపినట్లు తొలుత వార్తలు వచ్చాయి.
నేరాన్ని ఇంద్రాణి అంగీకరించిందని మీడియాలో వార్తలు వచ్చినప్పటికీ ఇంకా పోలీసులు ధృవీకరించడం లేదు. 10 రోజుల్లో 160 గంటల పాటు పోలీసులు ఇంద్రాణిని ప్రశ్నించారు. ఖార్ పోలీస్స్టేషన్లో శుక్రవారం కూడా తన కూతురు విధిని చూడగానే ఇంద్రాణి మరోసారి ఏడుపు లంకించుకుంది.
కారు డ్రైవర్ శ్యాం రాయ్ కూడా పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు. ఇతడు ఇప్పటికే నేరాన్ని అంగీకరించాడు. ఇంద్రాణికి చెందిన మొత్తం కుటుంబాన్ని ఏకకాలంలో పోలీస్స్టేషన్కు పిలిపించి ఇంటరాగేట్ చేస్తున్న ముంబై పోలీసులు మిస్టరీని రేపో మాపో అధికారికంగా వెల్లడించనున్నారని సమాచారం.