కరోనాను జయించిన నెలన్నర పసికందు... 10 రోజులు వెంటిలేటర్పై చికిత్స...
కరోనా... ఈ పేరు వింటే చాలు ఒకరకమైన నిస్తేజం,విషాదం కమ్ముకుపోయే పరిస్థితి నెలకొంది. అయితే ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. నాణేనికి మరోవైపు తరచి చూస్తే... కరోనాను జయించి పూర్తి ఆరోగ్యంతో బయటపడ్డవారు ఎంతోమంది కనిపిస్తారు. పసికందుల నుంచి పండు ముసలివాళ్ల వరకూ ఎంతోమంది కరోనాను జయిస్తున్న ఘటనలు దేశంలో నిత్యం వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా ఒడిశాలోని భువనేశ్వర్లో నెలన్నర వయసున్న ఓ పసికందు కరోనాను జయించడం విశేషం.
వివరాల్లోకి వెళ్తే.. ఒడిశాలోని కలహండి జిల్లా రాంపూర్కు చెందిన అంకిత్ అగర్వాల్(32),ప్రీతి (29) దంపతులకు మార్చి 22న ఆడబిడ్డ జన్మించింది. బిడ్డకు గుడియా అని నామకరణం చేశారు. డెలివరీ తర్వాత ఇంటికి వెళ్లిన కొద్దిరోజులకే ఆ పసికందుకు జ్వరం మొదలైంది. పాలు కూడా సరిగా తాగట్లేదు. అయితే ఇదంతా సాధారణమేనని ఆ దంపతులు భావించారు.
ఆ తర్వాత కొద్దిరోజులకే వారి కుటుంబంలోని కొందరికి కోవిడ్ పాజిటివ్గా నిర్దారణ అయింది. దీంతో ఆ దంపతులు కూడా టెస్టులు చేయించుకున్నారు. టెస్టుల్లో వారికి పాజిటివ్గా తేలింది. అయితే ప్రీతికి పెద్దగా కరోనా లక్షణాలు లేకపోవడంతో ఆమె ఇంటి వద్దే హోం ఐసోలేషన్లో ఉన్నారు. అంకిత్కు కాస్త లక్షణాలు ఎక్కువగా ఉండటంతో భువనేశ్వర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు.
పాపను చూసుకుంటూ ఇంటి వద్దే హోం ఐసోలేషన్లో ఉన్న ప్రీతి... పాప శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించింది. వెంటనే తన సోదరి సాయంతో పీడియాట్రిక్ స్పెషలిస్టు వద్దకు తీసుకెళ్లింది. పాపకు అక్కడ వైద్య పరీక్షలు చేయగా కోవిడ్ న్యుమోనియా ఉన్నట్లు తేలింది. వైద్యుడి సలహా మేరకు వెంటనే ఆ పసికందును భువనేశ్వర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు.
అక్కడ డా.అరిజిత్ మోహాపాత్ర ఆ శిశువుకు చికిత్స అందించారు. ఆయన మాట్లాడుతూ... ఆ శిశువును తమ ఆస్పత్రికి తీసుకొచ్చినప్పుడు అప్పటికే తను తీవ్ర శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్నట్లు చెప్పారు. అన్ని రకాల ప్రయత్నాలు చేశాక... శిశువును చివరకు వెంటిలేటర్ పైకి షిఫ్ట్ చేశాం. చికిత్సలో భాగంగా రెమ్డిసివిర్తో పాటు అవసరమైన యాంటీ బయాటిక్స్ కూడా ఇచ్చాం. మా ప్రయత్నాలు ఫలించి 10 రోజుల్లో శిశువు కోలుకుంది.' అని తెలిపారు.
శిశువులు కరోనా బారినపడటం అసాధారణమేమీ కాదని డా.మోహాపాత్ర తెలిపారు. అయితే త్వరగా వ్యాధి లక్షణాలను గుర్తించి తగిన చికిత్స అందిస్తే దానివల్ల ఎదురయ్యే సమస్యలను తగ్గించగలమని చెప్పారు. చిన్నారుల్లో జ్వరం లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయవద్దన్నారు. చాలావరకు చిన్నారుల్లో స్వల్ప కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని... చాలామంది త్వరగానే కోలుకుంటున్నారని చెప్పారు.
Recommended Video
అదే ఆస్పత్రికి చెందిన పీడియాట్రిక్ స్పెషలిస్ట్ జతింద్ర పాండా మాట్లాడుతూ... థర్డ్ వేవ్లో చిన్నారులు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయని గుర్తుచేశారు. కాబట్టి గర్భిణీ స్త్రీలకు,పాలిచ్చే తల్లులకు వ్యాక్సినేషన్ విషయంపై ప్రభుత్వాలు ఆలోచించాలన్నారు.