ప్రమాదం: 3ఏళ్ల తర్వాత టెక్కీకి 2 కోట్ల పరిహారం
న్యూఢిల్లీ: ప్రమాదానికి గురైన ఓ సాప్ట్వేర్ ఇంజనీర్కు మూడు సంవత్సరాల తర్వాత రూ. 2.06 కోట్లు నష్టపరిహారం లభించింది. వివరాల్లోకి వెళితే, ఐఐటీ బాంబేలో బీటెక్ పూర్తి చేసిన అన్షుమ్ అగర్వాల్ 2012, జూన్ నెలలో కారు ప్రమాదానికి గురయ్యాడు.
ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు పాలైన అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదం జరిగిన సమయంలో అన్షుమ్ అగర్వాల్ ఓ బహూళజాతి కంపెనీలో రూ. 46.5 లక్షల వార్షిక వేతనం పొందుతున్నాడు. దీంతో ఈ ప్రమాదం వల్ల తన కెరీర్ ఇబ్బందులకు గురైందని తనకు న్యాయం చేయాలని అతడు ట్రైబ్యునల్కు వెళ్లాడు.
దీంతో రూ. 2.06 కోట్లు నష్ట పరిహారంగా ఇస్తున్నట్లు మోటారు వాహనాల నష్టపరిహారాల ట్రైబ్యునల్కు చెందిన అధికారి హర్నామ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. ఓరియంటల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ, కారు ప్రమాదానికి కారకుడైన వ్యక్తి కలిసి ఆ సాఫ్ట్వేర్ ఇంజినీర్కు ఈ పరిహారాన్ని అందజేయనున్నారు.
పరిహారంలో 50 శాతం నగదును ఐదు సంవత్సరాలకు గాను ఓ జాతీయ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామన్నారు. బాధిత ఇంజినీర్ ఈ పరిహారంపై స్పందిస్తూ ట్రైబ్యునల్ తనకు ప్రకటించిన పరిహారం తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో ఏర్పడ్డ లోటును పూడ్చలేదని, ఆ పరిహారం సరిపోదన్నాడు.
ఈ ప్రమాదం జరిగినప్పటి నుంచి ఇప్పటికీ నా ఆరోగ్యం కుదుటపడలేదని, జ్ఞాపకశక్తి పరమైన లోపాలు తలెత్తాయని సాఫ్ట్వేర్ ఇంజినీర్ తరపు న్యాయవాది కౌశిక్ తెలిపారు. చికిత్స కోసం రూ. 50 లక్షలు ఖర్చుపెట్టారని కౌశిక్ వెల్లడించారు.
జూన్ 14, 2012న ఢిల్లీలోని సైబర్ పార్కులో కంపెనీ ప్రొవైడ్ చేసిన కారులో సెక్టార్ 52లో తన నివాసానికి వస్తుండగా సెక్టార్ 44 వద్ద అగర్వాల్ ప్రయాణిస్తున్న కారుని ఢిల్లీలో కైలాష్ హిల్స్లో నివసిస్తున్న వైభవ్ ఖండేలావాల్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.