జనరల్ టికెట్ల బుకింగ్ కు రైల్వే కొత్త రూల్..! అక్టోబర్ 1 నుంచి అమలు..!
భారతీయ రైల్వే ప్రయాణికుల సౌకర్యం కోసం టికెట్ బుకింగ్స్ లో ఎప్పటికప్పుడు పలుమార్పులు తెస్తూనే ఉంది. ముఖ్యంగా సాధారణ ప్రయాణికులకు అందాల్సిన రిజర్వేషన్ టికెట్లు అందకుండా దళారులు చేతివాటం ప్రదర్శిస్తున్న నేపథ్యంలో తాజాగా మరో కొత్త రూల్ ను అమలు చేయాలని నిర్ణయించింది. జనరల్ టికెట్లను ఐఆర్సీటీసీ యాప్, వెబ్ సైట్ లో రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులకు ఈ రూల్ వర్తించనుంది.
ఇప్పటివరకూ తత్కాల్ విధానంలో ప్రయాణికులు తొలి 15 నిమిషాల పాటు టికెట్ బుకింగ్స్ చేసుకునేందుకు ఆధార్ ధృవీకరణ తప్పనిసరిగా అమలవుతోంది. అయితే ఇప్పుడు జనరల్ టికెట్లను రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులకు సైతం ఈ రూల్ ను అమల్లోకి తెచ్చారు. అక్టోబర్ 1 నుంచి ఐఆర్సీటీసీ యాప్ లేదా వెబ్ సైట్ లో తొలి 15 నిమిషాల్లో జనరల్ టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులు కూడా తప్పనిసరిగా ఆధార్ ఆథెంటికేషన్ కలిగి ఉండాలి. లేకపోతే టికెట్లు బుక్ కావు.

దళారులు, అనధీకృత వ్యక్తులు జనరల్ టికెట్ల బుకింగ్స్ ను దుర్వినియోగం చేస్తున్న నేపథ్యంలో దాన్ని అరికట్టేందుకు ఇలా ఆధార్ ఆథెంటికేషన్ రూల్ తీసుకొస్తున్నట్లు రైల్వే శాఖ వర్గాలు తెలిపాయి. అయితే జనరల్ టికెట్ల బుకింగ్స్ కు రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల వద్ద మాత్రం ఈ రూల్ వర్తించదు. నేరుగా ప్రయాణికులే వెళ్లి బుక్ చేసుకుంటారు కాబట్టి అక్రమాలు జరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. అలాగే రైల్వే టికెట్ల ఆధీకృత ఏజెంట్లకు తొలి 10 నిమిషాల బుకింగ్ రూల్ లో కూడా ఎలాంటి మార్పు లేదని రైల్వే అధికారులు తెలిపారు.

వాస్తవానికి ఐఆర్సీటీసీ యాప్, వెబ్ సైట్ లో తత్కాల్ టికెట్ బుకింగ్స్ కు ఆధార్ ఆథెంటికేషన్ ను తప్పనిసరి చేస్తూ ఈ ఏడాది జూలై1 నుంచి రైల్వే నిబంధన తెచ్చింది. అయితే రైల్వే టికెట్ బుకింగ్ ఏజెంట్స్ కు మాత్రం తొలి రోజు తత్కాల్ టికెట్లు తొలి 30 నిమిషాల్లో బుక్ చేసుకునేందుకు వీలు లేదు. దీంతో ఉదయం 10 గంటల నుంచి 10.30 వరకూ ఏసీ టికెట్లకు, 11 గంటల నుంచి 11.30 వరకూ నాన్-ఏసీ టికెట్లకు ఈ రూల్ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications