ఐదు రాష్ట్రాల పోల్స్: మోడీ మేజికేనా, ఏ సర్వే ఏమంది?
న్యూఢిల్లీ: ప్రీ ఫైనల్స్గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కమలం గాలి వీచిందని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో బిజెపి ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుందని, ఢిల్లీలో హంగ్ ఏర్పడే అవకాశాలు ఉన్నప్పటికీ బిజెపికే ఎక్కువ సీట్లు వస్తాయని తేల్చాయి. దీంతో గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ మేజిక్ పని చేసిందా అనే చర్చ సాగుతోంది.
మోడీ ప్రభావం కనిపించిందని కొందరు చెబుతుంటే, అలాంటిదేం లేదని మరికొందరు అంటున్నారు. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లలో ఆయా ముఖ్యమంత్రులు రమణ్ సింగ్, శివరాజ్ సింగ్ చౌహాన్ల అభివృద్ధి, సంక్షేమ పథకాల వల్ల బిజెపి అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని, రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై వ్యతిరేకత, వసుంధర రాజే ప్రభావంతోనే బిజెపి అధికారంలోకి రానుందని అంటున్నారు. ఢిల్లీలో మూడు పర్యాయాలు ఏలిన షీలాదీక్షిత్ ప్రభుత్వంపై వ్యతిరేకత వల్ల బిజెపి గట్టెక్కుతోందంటున్నారు. అయితే మోడీ వల్లనే మంచి ఫలితాలు వస్తున్నాయని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నెల 8వ తేదిన ఫలితాలు రానున్నాయి.
ఏ సర్వేలు ఏం చెప్పాయి?
మధ్యప్రదేశ్లో శివరాజ్సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బిజెపి సర్కారు వరుసగా మూడోసారి 'క్లీన్ స్వీప్' చేస్తుందని 'ఇండియా టుడే - ఓఆర్జీ మార్గ్' ఎగ్జిట్ పోల్ పేర్కొంది. 230 స్థానాలున్న అసెంబ్లీలో 138 బిజెపికి దక్కుతాయని, కాంగ్రెస్ 80తో సరిపెట్టుకుంటుందని తెలిపింది. ఇక ఛత్తీస్గఢ్లో రమణ్ సింగ్కు మరోసారీ తిరుగుండదని ఈ సర్వే తెలిపింది. అక్కడ బిజెపికి 53 స్థానాలు లభిస్తాయని, కాంగ్రెస్ 33 సీట్లతో సరిపెట్టుకుంటుందని పేర్కొంది. రాజస్థాన్లో ఇన్నాళ్లుగా విపక్షపాత్రకు పరిమితమైన బిజెపి ఇక అధికారంలోకి రావడం ఖాయమని హెడ్లైన్స్ టుడే ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.
200 స్థానాలున్న ఈ రాష్ట్రంలో కమలం 110 చోట్ల వికసిస్తుందని, కాంగ్రెస్ 62 సీట్లకు పరిమితమవుతుందని ఈ ఫలితాల్లో తేలింది. రాజస్థాన్ ముఖ్యమంత్రి గెహ్లాట్కు ప్రభుత్వ వ్యతిరేక సెగ తప్పదని ఎగ్జిట్ పోల్స్లో స్పష్టమైంది. ఢిల్లీలో 'సరికొత్తగా తెరపైకి వచ్చి సంచలనాలు సృష్టిస్తుంది' అనుకున్న కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ అధికారానికి చేరువ కాలేదని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.
బిజెపి అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని అన్ని సర్వేలు తెలిపాయి. ఇండియా టుడే, ఏబీపీ నీల్సన్ ప్రకారం... ఢిల్లీలో బిజెపికి 32 స్థానాలు లభిస్తాయి. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ చెరో 18 స్థానాల్లో నెగ్గుతాయి. ఇండియా టుడే-ఓఆర్జీ మాత్రం 70 స్థానాలున్న ఢిల్లీలో బిజెపి 32 చోట్ల గెలిచి అధికారాన్ని కైవసం చేసుకుంటుందని తేల్చింది.
టైమ్స్ నౌ - సి వోటర్ సర్వే ప్రకారం... ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లలో వరుసగా బిజెపికి 31, 128, 44, 130 సీట్లు, కాంగ్రెసుకు 24, 92, 41, 48 సీట్లు వస్తాయి.
ఓఆర్జి, ఇండియా టుడే సర్వే ప్రకారం... ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లలో వరుసగా బిజెపికి 41, 138, 53, 110, కాంగ్రెసుకు, 20, 80, 33, 62 సీట్లు వస్తాయి.
చాణక్య సర్వే ప్రకారం... ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లలో వరుసగా బిజెపికి 29, 161, 51, 39, కాంగ్రెస్కు 10, 62, 39, 14 వస్తాయి.
ఇక ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి టైమ్స్ నౌ - సి వోటర్ ప్రకారం 11, ఓఆర్జి, ఇండియా టుడే సర్వే ప్రకారం 6, చాణక్య సర్వే ప్రకారం 31 వస్తాయి.