‘104’ విజయోత్సాహం: ఇస్రో ముందున్న భారీ టార్గెట్ ఇదే
ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగించి చరిత్ర సృష్టించిందిన ఇస్రో.. ఇప్పుడు మరో భారీ లక్ష్యాన్ని తన ముందు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
శ్రీహరికోట: ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగించి చరిత్ర సృష్టించిందిన ఇస్రో.. ఇప్పుడు మరో భారీ లక్ష్యాన్ని తన ముందు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. 104 ఉపగ్రహాలను ఒకేసారి అంతరిక్షంలోకి పంపి కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టిన ఇస్రోను.. ప్రపంచ దేశాలన్నీ అభినందనలతో ముంచెత్తుతున్నాయి.
కాగా, ఇదే విజయోత్సాహంలో భారతీయులకు మరో శుభవార్త వినిపించడానికి కూడా సిద్ధమవుతోంది ఇస్రో. ఇప్పటిదాకా మనుషుల్ని అంతరిక్షంలోకి పంపిన అనుభవం లేదు ఇస్రోకు. ఆ వైపుగా దృష్టి కూడా సారించలేదు. అయితే, ఆ లోటూ త్వరలోనే తీర్చేందుకు ఇస్రో కసరత్తులు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
ఇందుకోసం మానవసహిత అంతరిక్ష కార్యక్రమాల కోసం వ్యోమగాముల ఎంపిక ప్రక్రియా మొదలైపోయింది. ఇస్రో, భారత వైమానిక దళం సంయుక్తంగా చేపట్టిన ప్రతిష్ఠాత్మక కార్యక్రమం ఇది. ఈ ప్రాజెక్టుతో రష్యా, అమెరికా, చైనాల సరసన మనదేశం కూడా చేరనుంది.
చరిత్రాత్మకం: నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ-సీ37
కాగా, ప్రయోగించే ప్రతి ఉపగ్రహానికీ ఒక వాహక నౌకను తయారు చేసుకోవడం అంటే, వేలకోట్ల రూపాయల వ్యవహారం. అది కూడా ఒక్కసారికే పనికొస్తుంది. అదే నౌకను వెనక్కి రప్పించుకుని, మళ్లీ మళ్లీ ఉపయోగిస్తే.. పెద్ద మొత్తంలో భారం తగ్గుతుంది.
అంతరిక్ష ప్రయోగాల వ్యయమూ ఎనభైశాతం మేర పడిపోతుంది. ఆ ఆలోచనతోనే... ఇస్రో పునర్వినియోగ వాహక నౌకను రూపొందించింది. ప్రయోగాత్మకంగా శ్రీహరికోట నుంచీ 65 కిలోమీటర్ల ఎత్తు వరకూ పంపి, మళ్లీ వెనక్కి తెప్పించింది. ఆ ఉత్సాహంతోనే ఈసారి ఇంకో అడుగు ముందుకేయబోతోంది.
ఇస్రో చేతికి చిక్కిన వరమే పీఎస్ఎల్వీ
పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (పీఎస్ఎల్వీ) ఇస్రో చేతికి చిక్కిన వరమని చెప్పవచ్చు. శ్రీహరికోటలోని పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (పీఎస్ఎల్వీ) ద్వారా 38 సార్లు ఉపగ్రహాలను ఇస్రో అంతరిక్షంలోకి పంపింది. మంగళ్యాన్లతో పాటు అనేక కీలక విజయాలను ఈ వాహకనౌకే అందించింది.
ఇంత కచ్చితత్వం ఎక్కడా సాధ్యం కాదు. అందుకే, పీఎస్ఎల్వీని అత్యంత విశ్వసనీయ మిత్రుడిగా ఇస్రో భావిస్తుంది. మరో వాహకనౌక, జీఎస్ఎల్వీ నుంచి పది ప్రయోగాలు జరిగాయి. అందులో ఆరు విజయవంతం అయ్యాయి. అందుకే చరిత్రాత్మక ప్రయోగానికి పీఎస్ఎల్వీనే ఇస్రో రంగంలోకి దించింది.
ఇప్పటి వరకూ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మొత్తం 59 ప్రయోగాలు చేపట్టింది(నేటి ప్రయోగం కాకుండా). వాటి ద్వారా మన దేశానికి చెందిన 84 ఉపగ్రహాలనూ, డెబ్భైతొమ్మిది విదేశీ ఉపగ్రహాలనూ నింగికి పంపింది. వివిధ విశ్వవిద్యాలయాల విద్యార్థులు రూపొందించిన మరో ఎనిమిదింటిని కూడా అంతరిక్షానికి చేరవేసింది.