ఇదే పని మరొకరు చేస్తే.. దేశద్రోహి
పాకిస్థాన్ అన్నా, ఆ దేశ పౌరులన్నా కమలనాథులు తీవ్రమైన విద్వేషం వెళ్లగక్కుతారు. ఎందుకంటే అది ముస్లింల జనాభా అత్యధికంగా గల దేశం.
పాకిస్థాన్ అన్నా, ఆ దేశ పౌరులన్నా కమలనాథులు తీవ్రమైన విద్వేషం వెళ్లగక్కుతారు. ఎందుకంటే అది ముస్లింల జనాభా అత్యధికంగా గల దేశం. భారత్లో ఉన్న హిందువుల్ని రెచ్చగొట్టడానికి బీజేపీకి దొరికిన ఆయుధం 'పాకిస్తాన్'. కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చాక, పాక్ పౌరుల భారతదేశానికి రాకపై కఠినమైన వీసా ఆంక్షల్ని విధించింది.
పాక్ పౌరులతో బంధుత్వం, స్నేహం, వర్తక, వాణిజ్య బంధాన్ని కలిగి ఉండటం బీజేపీ దృష్టిలో పెద్ద నేరం. కానీ ప్రధాని నరేంద్ర మోడీ వెంట నిరంతరం నీడలా ఉండే జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఎ) అజిత్ దోవల్ కుమారుడు శౌర్య దోవల్ మాత్రం పాకిస్థాన్ జాతీయుడితో ఎంచక్కా వ్యాపారం నిర్వహిస్తున్నా బీజేపీ నేతల దృష్టిలో ఇది నేరం కాదు.మరొకరు చేస్తే దేశద్రోహి ముద్ర వేస్తారు.
ఇదీ కేంద్రంలో అధికారంలో కమలనాథుల దమననీతికి నిదర్శమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. పాకిస్థానీయుల పట్ల గానీ, పాకిస్థాన్ పట్ల విమర్శలు చేసే ముందు ప్రధాని మోదీ, ఆయన క్యాబినెట్ సహచరులు ముందు అజిత్ దోవల్ తనయుడు శౌర్య దోవల్ నుంచి స్ఫూర్తి పొందాలన్న సూచనలు వినిపిస్తున్నాయి.
బీజేపీ దృష్టిలో దుష్ట దుర్మార్గ దేశం పాకిస్థాన్ అన్నదే నిజమైతే! మరి అలాంటి దేశానికి చెందిన పౌరుడితో వ్యాపార సంబంధాల్ని కలిగి ఉన్న వ్యక్తి తండ్రి(అజిత్ దోవల్)ని ప్రధాని మోడీ పక్కనే కూర్చోవటాన్ని బీజేపీ ఎలా సహిస్తున్నది.
కేంద్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైన జాతీయ భద్రతా సలహాదారు హౌదాలో అజిత్ దోవల్ కొనసాగటాన్ని ఎలా అర్థం చేసుకోవాలని వివిధ రాజకీయ పక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అజిత్ దోవల్ కుమారుడు శౌర్య దోవల్ వ్యవహారాన్ని 'ఆమ్ ఆద్మీ' పార్టీ నాయకుడు ఆశిష్ ఖేతన్ ఇటీవలే బయటపెట్టారు. 'పాక్తో క్రీడలు ఆడొద్దు, అక్కడి నటీనటులతో సినిమాలు తీయొద్దు, వారితో వ్యాపారాలు చేయొద్దు' అని చెప్తూ వచ్చిన బీజేపీ సర్కార్, 'శౌర్య దోవల్' వ్యవహారానికి ఏమని సమాధానం చెబుతుంది ? అని ఆశిష్ ఖేతన్ ప్రశ్నించారు. పాక్ అంటే, ముస్లింలు అంటే విద్వేషాన్ని రగిలించడానికి బీజేపీ ఇంతదాకా ఏమేమి చేసిందో ఆశిష్ ఖేతన్ ఉదహరించారు.
2015లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. మోడీ ఓడిపోవటంతో పాకిస్థాన్ అంతటా వేడుకలు జరుపుకుంటున్నారని బీజేపీ నాయకుడు, కేంద్ర చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోడీ ఓటమిని కోరుకున్నవారంతా పాకిస్తాన్ అనుకూలురని తేల్చేశారు. పాకిస్థాన్ను, ఆ దేశ పౌరుల్ని దుష్ట దుర్మార్గులుగా చూపించే ప్రయత్నం చేశారు.
మైనారిటీ వ్యవహారాలశాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ మరో అడుగు ముందుకేసి బీఫ్ తినాలనుకునేవారంతా పాకిస్థాన్, అరబ్ దేశాలకు వెళ్లాలని ప్రకటించారు. కేవలం ముస్లింలు మాత్రమే బీఫ్ను తింటారని, హిందువుల్లో ద్వేష భావాన్ని రగిలించటమే ఇది. చైనా, దక్షిణాసియా, తూర్పు ఆసియా, యూరప్ దేశాలలో కూడా బీఫ్ను పెద్ద సంఖ్యలో ప్రజలు ఆహారంగా తీసుకుంటారు. ఈ దేశాల పేర్లేవీ ప్రస్తావించకుండా కేవలం పాకిస్థాన్ను మాత్రమే కమలనాథులు పట్టుకోవటం వెనుక పెద్ద రాజకీయ కుట్ర ఉంది. ఇలాంటి వ్యాఖ్యలతో రాజకీయంగా హిందువుల్ని ప్రభావితం చేయటమే కమలనాధుల ప్రధాన ఎజెండా అని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
2016లో బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ తీసిన 'ఏ దిల్ హై ముష్కిల్' సినిమాకు వ్యతిరేకంగా బీజేపీ, శివసేన నానా రభస చేశాయి. ఒక పాకిస్థాన్ నటుడ్ని ఈ సినిమాలోకి తీసుకోవటమే కరణ్ జోహార్ చేసిన తప్పుగా బీజేపీ, శివసేన నాయకులు వాదించారు. సినిమాను ఆడనీయమని బెదిరించారు. చివరికి తాను భారతీయుడినని, ముందు భారత దేశానికి ప్రాధాన్యం ఇస్తామని, మళ్లీ పాకిస్థాన్ నటులతో మళ్లీ సినిమాలు తీయబోనని, నాకు భారత సైన్యం అంటే గౌరవం అని కరణ్జోహార్ క్షమాపణలు చెప్పాకగానీ అడ్డంకులు తొలిగిపోలేదు.
భారత 'జాతీయ భద్రతా సలహాదారు' అజిత్ దోవల్ కుమారుడు శౌర్య దోవల్ నడుపుతున్న కంపెనీ పేరు 'జెమినీ ఫైనాన్షియల్ సర్వీసెస్'. ఈ కంపెనీలో శౌర్య దోవల్కు పాకిస్థాన్ దేశీయుడైన సయ్యద్ అలీ అబ్బాస్, సౌదీ యువరాజు మిషాల్ బిన్ అబ్దుల్లా బిన్ తుక్రీ భాగస్వాములు. భారత్లో వివిధ విధానాల నిర్ణయాలు తీసుకునేందుకు అధ్యయనానికి 'ఇండియన్ ఫౌండేషన్' అనే మరో సంస్థను కూడా శౌర్య దోవల్ నడుపుతున్నాడు. ఈ సంస్థలో నలుగురు కేంద్ర మంత్రులు డైరెక్టర్లుగా ఉన్నారు. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ డైరెక్టర్లలో ఒకరు.
ఈ సంస్థకు సహ వ్యవస్థాపకుడు బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్. పాకిస్థాన్తో ఉండే ఏ సంబంధమైనా అది అపవిత్రమైనదే, అక్రమమైనదే అయితే... అజిత్ దోవల్ను, ఆయన కుమారుడి సంస్థతో సంబంధాలు ఉన్న బీజేపీ నాయకుల్ని ఏమనాలి? కేవలం ప్రధాని కార్యాలయం వ్యక్తులు, ఆర్ఎస్ఎస్ మాత్రమే పాక్తో సంబంధాల్ని కలిగి ఉండొచ్చా? లేదూ. రాజకీయంగా, సైద్ధాంతికంగా పరిణితి చెందారా? పరిణితి చెందితే అందరమూ ఆహ్వానిస్తాం. ఇరు దేశాల పౌరుల మధ్య బాంధవ్యాలు, వర్తక వాణిజ్య సంబంధాలు పెరగాలి. బీజేపీ నాయకులు 'శౌర్య దోవల్' వ్యవహారంపై మౌనం వీడి ప్రతిస్పందించాలని రాజకీయ విశ్లేషకులు, ప్రతిపక్ష పార్టీలు అభిప్రాయ పడుతున్నాయి.