జమ్మూకశ్మీర్లో నేడు తొలిదశ స్ధానిక ఎన్నికలు- ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి
జమ్మూకశ్మీర్లో గతేడాది ఆర్టికల్ 370 రద్దు తర్వాత పలువురు ప్రాంతీయ పార్టీల నేతలు, మాజీ సీఎంలు గృహనిర్బంధంలోకి వెళ్లారు. ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. కశ్మీర్కు వెళ్లేందుకు ఇతర ప్రాంతాలకు చెందిన రాజకీయ నేతలకు కూడా అనుమతి ఇవ్వలేదు. ఆ తర్వాత సుప్రీంకోర్టు జోక్యంతో అక్కడి రాజకీయ నేతలు ఒక్కొక్కరుగా గృహనిర్బంధం నుంచి విడుదలయ్యారు. అంతే కాదు అప్పటి అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. అయితే అక్కడి ప్రజలు ఏమనుకుంటున్నారో మాత్రం తేలలేదు..
Recommended Video
ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా జమ్మూకశ్మీర్లోని జిల్లా అభివృద్ధి కౌన్సిళ్లకు, పంచాతీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 19 మధ్య ఎనిమిది విడతలుగా జిల్లా కౌన్సిళ్ల ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇందులో మారుమూల ప్రాంతాల్లోనే తొలి రెండు విడతల ఎన్నికలు జరగబోతున్నాయి. ఇవాళ జమ్మూకశ్మీర్లోని 43 నియోజకవర్గాల పరిధిలో ఉన్న జిల్లా అభివృద్ధి కౌన్సిళ్లకు (డీడీసీ) ఎన్నికలు జరగబోతున్నాయి.

ఇక్కడి ప్రజలు సుదీర్ఘ విరామం తర్వాత తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఈ 43 నియోజకవర్గాల్లో కశ్మీర్లో 25, జమ్మూలో 18 ఉన్నాయి. మొత్తం 7 లక్షల మంది ఓటర్లు బరిలో నిలిచిన 1427 మంది అభ్యర్ధుల భవితవ్యాన్ని నిర్ణయించబోతున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకే పోలింగ్ నిర్వహిస్తారు. మారిన పరిస్ధితుల్లో ఈ ఎన్నికల్లో స్ధానిక ప్రజలు ఎటువైపు మొగ్గుతారన్నది ఆసక్తికరంగా మారింది.

డీడీసీ ఎన్నికలతో పాటు పంచాతీలకు ఉప ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. వీటిని కూడా ఎనిమిది దశల్లో నిర్వహిస్తున్నారు. మొత్తం 368 నియోజకవర్గాల్లో పంచాయతీ ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇందులో తొలి విడతలో మొత్తం 94 నియోజకవర్గాల్లో పంచాయతీ ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. వీటిలో 279 మంది అభ్యర్ధులు రంగంలో నిలిచారు. మొత్తం 8 దశల పోలింగ్ ముగిశాక డిసెంబర్ 22న ఓట్ల లెక్కింపు చేసి ఫలితాలను ప్రకటిస్తారు.












Click it and Unblock the Notifications