ఆర్మీ కీలక పాత్ర, దాణా స్కాం నిందితుడి ఫ్లాట్స్ వేలం
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్లో వరద బాధితులను రక్షించడంతో సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కీలక పాత్ర పోషించాయని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియాతో మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లో ఇప్పటి వరకు సైన్యం 1.30 లక్షల మందిని రక్షించినట్లు వెల్లడించారు.
తమ ప్రభుత్వం మాటలు మాత్రమే చెప్పదని.. చేతల్లో కూడా చూపిస్తుందని స్పష్టం చేశారు. జమ్మూకాశ్మీర్ ను అన్ని విధాలా ఆదుకుంటామని రాజ్ నాథ్ చెప్పారు. జమ్మూ కాశ్మీర్లో పరిస్దితిని ఎప్పటికప్పుడు కేంద్ర హోంశాఖ కార్యదర్సి పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో వరదసాయం, పునరావాసానికి కేంద్రం రూ. 1,000కోట్లు కేటాయించిందన్నారు.
వామపక్ష తీవ్రవాదం నిర్మూలనకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ఆల్ ఖైదా విభాగం ఏర్పాటుపై భయపడాల్సిందేమీ లేదని, ఆల్ ఖైదా సీడీని నిఘా సంస్దలు పరిశీలిస్తున్నాయన్నారు.
వేలానికి దాణా కుంభకోణం నిందితుడు మోహన్ ప్రసాద్ 18 ప్లాట్లు
బీహార్లో దాణాకుంభకోణం నిందితుడు త్రిపురారి మోహన్ ప్రసాద్కు చెందిన 18 ఫ్లాట్లను ఆదాయ పన్ను శాఖ ఈరోజు వేలం వేయనుంది. అతను రూ. 44 కోట్లు బాకీ ఉండటంతో ఫ్లాట్లను వేలం వేయడం ద్వారా వచ్చిన సొమ్ముతో ఆ బాకీ జమకట్టడానికి ఐటీ శాఖ ఈ వేలం వేస్తోంది.
1996 బీహార్లో జరిగిన గడ్డిస్కామ్లో సంపాదించినవే. త్రిపురారి మోహన్ ప్రసాద్ అప్పట్లో బీహార్ రాష్ట్ర పశుసంవర్దక శాఖకు గడ్డి సరఫరా చేసేవారు. 2012 నుంచి త్రిపురారి మోహన్ ప్రసాద్ జైల్లో ఉన్నారు. అతనికున్న 18 ఫ్లాట్లు దానాపూర్ ప్రాంతంలోని ఓకే అపార్ట్ మెంట్ లో ఉన్నాయి. ఒక్కోక్కటీ రూ. 37 నుంచి 47 లక్షల వరకు విలువ చేస్తాయని స్దానికులు పేర్కొన్నారు. వేలాన్ని ఆపడానికి త్రిపురారి మోహన్ ప్రసాద్ సహా అతని బంధువులు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.