రన్వే అనుకొని రోడ్డుపైనే విమానాన్ని దించబోయాడు!
జైపూర్: ఇండిగో ఎయిర్లైన్స్కు చెందిన విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఫిబ్రవరి 27న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అహ్మదాబాద్ నుంచి జైపూర్ వెళ్తున్న 6ఈ-237 విమానం పైలట్ జైపూర్ విమానాశ్రయానికి సమాంతరంగా ఉన్న సాధారణ రోడ్డును రన్వే అనుకున్నాడు.
ఇంకేముందు ఆ రోడ్డుపైనే విమానం దించబోయాడు. ఇంతలో కాక్పిట్లో అలారం రావడంతో తేరుకుని విమానాన్ని మళ్లీ కొంతమేర పైకి లేపి విమానాశ్రయ రన్వేపై సురక్షితంగా ల్యాండ్ చేశాడు.
ఒకటిన్నర నిమిషంలో ల్యాండ్ అవ్వాల్సి ఉండగా విమానం 900 అడుగుల ఎత్తు నుంచి 700 అడుగుల ఎత్తుకు దిగగానే వార్నింగ్ సిస్టమ్ హెచ్చరించడంతో పైలట్ వెంటనే తేరుకుని మళ్లీ విమానాన్ని కొంత ఎత్తులో పైకి తీసుకెళ్లి విమానాశ్రయ రన్వేపై ల్యాండ్ చేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
కాగా, రోడ్డును రన్వేగా భావించి ల్యాండ్ చేయబోవడం చాలా పెద్ద పొరపాటు అని, ఇది చాలా సీరియస్ విషయమని దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని ఇండిగో అధికారులు వెల్లడించారు.
అంతేగాక, ప్రయాణికుల భద్రతే తమ మొదటి ప్రాధాన్యమని ఇండిగో స్పష్టం చేసింది. కాగా, ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విచారణకు ఆదేశించిండంతో దర్యాప్తు కొనసాగుతోంది. విమానంలోని ఇద్దరు పైలట్లను ఘటన జరిగిన వెంటనే విధుల నుంచి తప్పించామని.. విచారణ అనంతరం వారిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.