ప్రఖ్యాత వైష్ణోదేవి ఆలయంలో మృత్యుకేళి: పలువురు భక్తులు దుర్మరణం
జమ్మూ: ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందిన పవిత్ర పుణ్యక్షేత్రం వైష్ణోదేవి ఆలయంలో పెను దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలు పలువురు భక్తులు దుర్మరణం పాలయారు. పలువురు గాయపడ్డారు. గాయపడ్డ వారిని హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. వారిలో చాలామంది ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అత్యవసర సర్వీసుల సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను చేపట్టారు.
అత్యంత ప్రధానమైన ఆలయం..
జమ్మూ కాశ్మీర్లోని కాట్రా జిల్లాలో ఉందీ వైష్ణోదేవి ఆలయం. జమ్మూ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో..త్రికూట పర్వతం మీద వెలిశారు అమ్మవారు. శక్తిపీఠాల్లో అత్యంత ప్రధానమైనదిగా భావిస్తారు భక్తులు. ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. ఉత్తరాధి వారికి అత్యంత ప్రధానమైన పుణ్యక్షేత్రం ఇది. ఏటా కొన్ని లక్షల మంది ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. మొక్కులు చెల్లించుకుంటారు. అన్ని ప్రధాన నగరాల నుంచి రైలు, బసు మార్గాలు ఉండటంతో ఏటేటా లక్షల మంది భక్తులు వైష్ణోదేవి ఆలయానికి వెళ్తుంటారు.
వేలాదిమంది చేరుకోవడంతో తొక్కిసలాట..
అమ్మవారి దర్శనంతో కొత్త సంవత్సరాన్ని కొత్త ఆశలతో స్వాగతం పలకడానికి వేలాదిమంది చేరుకున్న వేళ.. ఈ పెను దుర్ఘటన చోటు చేసుకుంది. నూతన పురస్కరించుకుని వేలాదిమంది భక్తులు శుక్రవారం రాత్రికే కాట్రాకు చేరుకున్నారు. అక్కడి బేస్ క్యాంప్ నుంచి త్రికూట పర్వతంపైకి కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది. 12 గంటల సమయంలో వైష్ణోదేవి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు వేలాదిమందిగా తరలిరావడంతో అక్కడి పరిస్థితులు అదుపు తప్పాయి. తొక్కిసలాట చోటు చేసుకుంది.
12 మంది దుర్మరణం..
పర్వతప్రాంతం కావడం.. ఇరుకైన రహదారులు ఉండటం.. వేల సంఖ్యలో భక్తులు ఒకేసారి అమ్మవారిని దర్శించుకోవడానికి రావడం వల్ల తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఇప్పటిదాకా 12 మంది భక్తులు దుర్మరణం పాలయ్యారు. 14 మందికి పైగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. వారిని కాట్రా కమ్మూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు.
భీతావహంగా..
మృతుల్లో ఢిల్లీ, హర్యానా, పంజాబ్ నుంచి వచ్చిన భక్తులు ఉన్నట్లు కాట్రా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ బ్లాక్ మెడికల్ ఆఫీసర్ గోపాల్ దత్ తెలిపారు. జమ్మూ కాశ్మీర్కు చెందిన మరొకరు మరణించినట్లు చెప్పారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అత్యవసర సర్వీసుల సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసు వాహనాలు, అంబులెన్సుల సైరన్ల మోతలతో కాట్రా మొత్తం భీతావహంగా మారింది.
ప్రధాని సంతాపం
ఈ ఘటన పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఈ ఘటన కలచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని రెండు లక్షల రూపాయల నష్ట పరిహారాన్ని ప్రకటించారు. గాయపడ్డ వారికి 50 వేల రూపాయల తక్షణ ఆర్థిక సహాయాన్ని చెల్లించాలని ఆదేశించారు.