బిజెపిలో చేరిన జీవిత రాజశేఖర్ దంపతులు
న్యూఢిల్లీ: సినీ దంపతులు జీవిత, రాజశేఖర్ భారతీయ జనతా పార్టీ (బిజెపి)లో చేరారు. పార్టీ జాతీయాధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ సమక్షంలో వారు బిజెపి సభ్యత్వం తీసుకున్నారు. ప్రస్తుతం నరేంద్ర మోడీ ప్రభంజనం వీస్తుందనే అభిప్రాయంతో వారు బిజెపిలో చేరినట్లు కనిపిస్తోంది.
గత కొంత కాలంగా వీరు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వీరు తెలుగుదేశం పార్టీలో చేరడానికి ప్రయత్నాలు చేసినట్లు వార్తలు వచ్చాయి. అలాగే, జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసులో కూడా చేరుతారనే ఊహాగానాలు చెలరేగాయి. చివరగా, కాంగ్రెసు పార్టీలో చేరడానికి సిద్ధమైనట్లు కూడా చెప్పారు. కానీ, చివరకు బిజెపిలో చేరారు.
మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెసులో తన పార్టీని విలీనం చేయడం వల్ల, రాష్ట్ర విభజనకు కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం తీసుకోవడంతో జీవిత, రాజశేఖర్ దంపతులు ఆ పార్టీలో చేరడానికి ఇష్టపడలేదని అంటున్నారు.
గుజరాత్లో సర్దార్ వల్లభబాయ్ పటేల్ విగ్రహం ఏర్పాటుపై దక్షిణాది రాష్ట్రాల నాయకులతో బిజెపి ఇటీవల హైదరాబాద్లో ఓ వర్క్షాప్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి జీవిత, రాజశేఖర్ హాజరయ్యారు. అప్పటి నుంచే వారు బిజెపి వైపు మొగ్గు చూపారు. కాగా, సీనియర్ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు బిజెపిలో చేరిన విషయం తెలిసిందే.