మాజీ ప్రియుడి పురుషత్వంపై పగ: ప్రేరణ అక్కడిది
భోపాల్: తనను కాదని మరో యువతిని పెళ్లాడేందుకు సిద్ధపడిన ప్రియుడి పురుషత్వాన్ని తొలగించి, వంధ్యుడ్ని చేయడానికి ఓ మహిళ గుండాలను, హమిదా ఆస్పత్రికి చెందిన ఇద్దరు వార్డు బాయ్లను కిరాయికి తీసుకుంది. అయితే, పథకం అమలు పరిచేలోగానే ఆ వ్యక్తి గుండాల కత్తిపోట్లకు ప్రాణాలు విడిచాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.
మూడు రోజుల క్రితం నరియాల్ఖేడలోని ప్రేమ్ నగర్కు చెందిన 26 ఏళ్ల విజయం ఖడ్కే కత్తిపోట్లకు గురై మరణించాడు. ఈ కేసును నిషాత్పురా పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. కుట్ర చేసిన మహిళ కూడా అరెస్టయినవారిలో ఉంది.
తాను డాక్టర్ జయశ్రీ నామ్దేవ్ హత్య కేసు నుంచి ప్రేరణ పొందినట్లు నిందితురాలు సరిత చెప్పింది. వృక్షశాస్త్రంలో పోస్టు గ్రాడ్యుయేట్ అయిన సరితతో పాటు వార్డు బాయ్లు రాజేష్, రవిలను, వికాస్, పుష్పేంద్ర, అన్షూల్, మాయాంక్ అనే నలుగురు గుండాలను పోలీసులు అరెస్టు చేశారు.
అసలు పథకం ప్రకారం - గుండాలు విజయ్ను చితకబాదాలి. ఆ తర్వాత అతన్ని రాజేష్, రవి పనిచేస్తున్న ఆస్పత్రిలో చేర్చాలి. అక్కడ అతని పురుషత్వాన్ని తొలగించాలి. పథకం అమలుకు గుండాలకు సరిత 9 వేల రూపాయలు చెల్లించింది.
సరితపై అనుమానాలు వ్యక్తం చేస్తూ విజయ్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని హత్య జరిగిన రోజు సరిత విజయ్తో మాట్లాడినట్లు విచారణలో తేలింది. అదే సమయంలో ఆమె మొబైల్ కాల్ రికార్డుల ఆధారంగా దర్యాప్తు చేపట్టి సరితను అరెస్టు చేశారు.
సరితతో పెళ్లికి విజయ్ నిరాకరించాడు. విజయ్ మే 30వ తేదీన మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి రోజు వచ్చిన గొడవ చేయడానికి సరిత ప్రయత్నించింది. కానీ ఫలితం సాధించలేదు. విజయ్కు గుణపాఠం చెప్పాలని సరిత పథకం రచించి అమలు చేయడానికి ప్రయత్నించింది.