జియో ‘ఫ్రీ’ దెబ్బకు ప్రత్యర్థులు కుదేలు.. నాలుగో త్రైమాసికమూ ఇంతేనా?
జియో ఉచిత ఆఫర్ దెబ్బకు దాని ప్రత్యర్థి కంపెనీలైన భారతీ ఎయిర్ టెల్, ఐడియా సెల్యులార్, ఒడాఫోన్ లు నాలుగో త్రైమాసికంలోనూ కోలుకునేలా లేవని టెలికాం రంగ నిపుణులు చెబుతున్నారు.
ముంబై: రిలయన్స్ జియో ఉచిత ఆఫర్ దెబ్బకు మేజర్ టెలికాం రంగ దిగ్గజాలు భారతీ ఎయిర్ టెల్, ఐడియా సెల్యులార్, ఒడాఫోన్. రిలయన్స్ కమ్యూనికేషన్స్ మూడో త్రైమాసికంలోనూ ఒక్కసారిగా కుప్పకూలిన సంగతి తెలిసిందే.
నాలుగో త్రైమాసికంలోనూ దిగ్గజ కంపెనీల పరిస్థితి ఇలాగే ఉంటుందని టెలికాం రంగ నిపుణులు చెబుతున్నారు. రిలయన్స్ జియో ఉచిత డేటా ఆఫర్లు కొనసాగించినంత కాలం దాని ప్రత్యర్థుల మార్జిన్లకు భారీగానే గండిపడుతూ ఉంటుందని వారు పేర్కొంటున్నారు.
ఎప్పుడైతే జియో తన ఉచిత ఆఫర్లను ఉపసంహరించుకుని, డేటా సర్వీసులపై ఛార్జీలు వసూలు చేయడం ప్రారంభిస్తుందో అప్పటి నుంచి దాని ప్రత్యర్థులైన కంపెనీల పరిస్థితి కొంత మెరుగుపడవచ్చని టెలికాం ఇండస్ట్రీ ప్రాక్టిస్, ప్రైస్ వాటర్ కూపర్స్ ఇండియా భాగస్వామి అర్పితా పాల్ అగర్వాల్ పేర్కొంటున్నారు.
2016 సెప్టెంబర్ నుంచి వెల్ కమ్ ఆఫర్ కింద జియో ఉచిత ఆఫర్లు ఇవ్వడం ప్రారంభించింది. అనంతరం డిసెంబర్ లో మళ్లీ న్యూ ఇయర్ ఆఫర్ పేరిట వీటి గడువును 2017 మార్చి నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. దీంతో దాని ప్రత్యర్థి కంపెనీలైన ఎయిర్ టెల్, ఐడియా, ఒడాఫోన్ లు భారీగా ఆదాయాన్ని కోల్పోతున్నాయి.
భారతీ ఎయిర్ టెల్ 55 శాతం, ఐడియా సెల్యులార్ రూ.478.9 కోట్లను, రిలయన్స్ కమ్యూనికేషన్ రూ.531 కోట్ల నష్టాలను నమోదు చేశాయి. మార్కెట్ లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన జియో దోపిడీ ధరల విధానం వల్లనే తాము భారీగా ఆదాయాన్ని కోల్పోతున్నట్లు ఈ టెలికాం కంపెనీలు ఆరోపిస్తున్నాయి.
రిలయన్స్ జియో ఉచిత డేటా ఆఫర్ల దూకుడే టెలికాం కంపెనీలను భారీస్థాయిలో దెబ్బతీస్తుందని, ఇందులో ఎలాంటి సందేహం లేదని టెలికాం కన్సల్టెన్సీకి చెందిన ఓ సంస్థ డైరెక్టర్ మహేష్ ఉప్పల్ చెప్పారు.
కేవలనం ధరల విధానంపైనే భారత టెలికాం మార్కెట్ ఆధారపడి ఉంటుందని, ఇలాంటి ఉచిత ఆఫర్లు మార్కెట్ లో విధ్వంసం సృష్టించేలా ఉన్నాయని గార్టనర్ టెలికాం బిజినెస్ స్ట్రాటజీ ప్రిన్సిపల్ రీసెర్చ్ అనలిస్టు రిషి తేజ్ పాల్ వ్యాఖ్యనించారు.