కొత్త ట్విస్ట్: సీఎం మాంఝీ రాజీనామా, క్షమాపణ చెప్పిన నితీష్ కుమార్
పాట్నా: బీహార్ రాజకీయం మరో మలుపు తిరిగింది. బలపరీక్షకు ముందే ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ రాజీనామా చేశారు. తద్వారా ఆయన విశ్వాస పరీక్షకు ముందే చేతులెత్తేశారు. మాంఝీ తన మద్దతుదారులతో కలిసి శుక్రవారం ఉదయం గవర్నర్ను కలిశారు. తన రాజీనామా లేఖను అందజేశారు. మాంఝీకి బీజేపీ మద్దతిస్తామని తెలిపింది. అయితే, హఠాత్తుగా ఆయన రాజీనామా చేయడం గమనార్హం.
మరోవైపు, నితీష్ కుమార్ గవర్నర్ను కలవనున్నారు. తనకు మెజారిటికీ కావాల్సిన బలం ఉందని చెప్పనున్నారు. నితీష్కు ఆర్జేడీకి చెందిన 24 మంది, కాంగ్రెస్కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు ఉంది.
బీహార్లో 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 233 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. పది స్థానాలు ఖాళీగా ఉన్నాయి. జేడీయుకి 110, బీజేపీకి 87, ఆర్జేడీకి 24, కాంగ్రెస్ పార్టీకి ఐదు, సీపీఐకి ఒక్కరు, స్వతంత్రులు ఐదుగురు, మాంఝీ ఉన్నారు.
రాజీనామాపై నితీష్ కుమార్
మాంఝీ రాజీనామాతో బీజేపీ గేమ్ ప్లాన్ బహిర్గతమైందని నితీష్ కుమార్ అన్నారు. మాంఝీ బలపరీక్ష, రాజీనామా అన్నీ బీజేపీ గేమ్ ప్లాన్లో భాగమే అన్నారు. బీజేపీ గవర్నర్ పైన ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం ఉందన్నారు. జీతన్ రామ్ మాంఝీ రాజీనామా అనంతర పరిణామాలపై ఇప్పుడే మాట్లాడలేమన్నారు. తాను రాజీనామా చేయడం తప్పేనని, ప్రజలు క్షమించాలని నితీష్ కుమార్ అన్నారు. తనకు మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని, గవర్నర్ ఆహ్వానిస్తారని చూస్తున్నామన్నారు.