ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా జగ్ దీప్ ధన్కర్ - చివరి నిమిషంలో మార్పు : ఎంపిక వెనుక..!!
భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధిగా జగ్ దీప్ దన్కర్ పేరు ఖరారైంది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ధన్కర్ పేరును ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్మును ఎంపిక చేయటంతో.. ఉప రాష్ట్రపతిగా మైనార్టీ వర్గానికి ప్రాధాన్యత ఇస్తారనే ప్రచారం సాగింది. అందులో భాగంగా, కేంద్ర మంత్రి పదవికి తాజాగా రాజీనామా చేసిన ముఖ్తార్ అబ్బాస్ నక్వీ పేరు ప్రచారం సాగింది. ఈ నెల 19వ తేదీతో ఉప రాష్ట్రపతి ఎన్నికల నామినేష్ కు చివరి రోజు. ఈ క్రమంలో సమావేశమైన బీజేపీ పార్లమెంటరీ బోర్డు అనూహ్యంగా రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ప్రస్తుత పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా ఉన్న జగ్ దీప్ ధన్కర్ పేరు ఖరారు చేసారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్ది పేరును ప్రకటించారు.

ధన్కర్ ఎంపిక వెనుక భారీ వ్యూహం
న్యాయవాదిగా సుప్రీంకోర్టులో సుదీర్ఘ అనుభవం.. పార్లమెంట్ సభ్యుడిగా.. గవర్నర్ గా వ్యవహరించిన ధన్కర్ ఇప్పుడు ఎన్డీఏ నుంచి ఉప రాష్ట్రపతి రేసులో ఉన్నారు. 1951 మే 18న ధన్కర్ రాజస్థాన్ లోని ఒక చిన్న గ్రామంలో జన్మించారు. 1989లో తొలిసారి జనతాదళ్ నుంచి రాజస్థాన్ లోని జున్ జును లోక్ సభా నియోజకవర్గం నుంచి పార్లమెంట్ కు ఎన్నికయ్యారు. 19993-98 వరకు రాజస్థాన్ లో అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. 2019 జూలై 30న పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా నియమితులయ్యారు. 1990-91 కాలంలో చంద్రశేఖర్ ప్రధానిగా ఉండగా, ఆయన కేబినెట్ లో పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రిగా పని చేసారు.

చివరి నిమిషంలో మారిన సమీకరణాలు
పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ వర్సస్ కేంద్రం అన్నట్లుగా పరిస్థితి మారిన సందర్భంలో ధన్కర్ ను కు కేంద్రం పశ్చిమమ బెంగాల్ గవర్నర్ గా బాధ్యతలు అప్పగించింది. అనేక సందర్భాల్లో గవర్నర్ నిర్ణయాలతో మమతా బెనర్జీ విభేదించారు. ఇక, పార్లమెంటరీ వ్యవహారాల పైనా.. న్యాయ పరమైన అంశాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ధన్కర్ ను ప్రధాని మోదీ - బీజేపీ ముఖ్య నేతలు ఇప్పుడు ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎంపిక చేసారు. మైనార్టీ కోటాలో ఈ సారి ఉప రాష్ట్రపతి కానున్నారని కొంత కాలంగా ప్రచారం సాగింది. కేంద్ర మంత్రిగా ఉన్న నక్వీకి రాజ్యసభ రెన్యువల్ చేయకపోవటం ద్వారా.. ఆయనకు ఉప రాష్ట్రపతిగా అవకాశం దక్కుతందనే అంచనాలు వ్యక్తం అయ్యాయి.

బీజేపీ నేతల నిర్ణయం వెనుక
గత వారం జరిగిన కేబినెట్ సమావేశంలో నక్వీ తన పదవికి రాజీనామా చేసారు. ఆ సమయంలోనూ నక్వీ సేవలను ప్రధాని ప్రశంసించారు. కానీ, ఉపరాష్ట్రపతి ఎంపిక పైన ఈ రోజు ఢిల్లీ కేంద్రంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉదయం నుంచి ఢిల్లీలో ధన్కర్ ప్రధాని మోదీ - కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో పాటుగా పలువురు ప్రముఖులతో సమావేశమయ్యారు. ఒడిశా కి చెందిన గిరిజన మహిళ అయిన ద్రౌపదీ ముర్మును రాష్ట్రపతి అభ్యర్ధిగా.. రాజస్థాన్ కు చెందిన ధన్కర్ ను ఉప రాష్ట్రపతిగానూ ఎన్డీఏ వ్యూహాత్మకంగా ఖరారు చేసింది. గతంలో ఉపరాష్ట్రపతిగా పని చేసిన బైరాన్ సింగ్ షెకావత్ సైతం రాజస్థాన్ కు చెందిన వారే. ఇప్పుడు, ధన్కర్ ఎంపిక పైన రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.












Click it and Unblock the Notifications