పెంపుడు శునకం మిస్ అయిందని పోలీసులపై చర్యలకు ఆదేశం- జడ్జిపై బదిలీ వేటు
కోల్కత: ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గౌరంగ్ కాంత్పై బదిలీ వేటు పడింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో తన ఇంటి వద్ద భద్రతను పర్యవేక్షిస్తోన్న పోలీస్ కానిస్టేబుళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసిన కొద్దిరోజుల్లోనే ఆయన బదిలీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇదివరకు జస్టిస్ గౌరంగ్ కాంత్.. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పని చేశారు. ఆ సమయంలో ఆయన పెంపుడు శునకం తప్పిపోయింది. దీనికి ప్రధాన కారణం- తన ఇంటి వద్ద భద్రతగా ఉన్న పోలీసులేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారాయన. ప్రధాన గేటును లాక్ చేసి ఉంచడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఆరోపించారు.

లాక్ చేయకపోవడం వల్ల పెంపుడు శునకం గేటును దాటుకుని వెళ్లిపోయిందనే కారణంతో పోలీసులపై చర్యలకు ఆదేశించారు. వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీ జాయింట్ పోలీస్ కమిషనర్ (సెక్యూరిటీ)కు లేఖ రాశారు. జూన్ 12వ తేదీన ఆయన ఈ లేఖ రాశారు. డోర్ లాక్ చేసి ఉంచాలంటూ తాను పదే పదే వారికి చెప్పినప్పటికీ- ఆదేశాలను పాటించడంలో విఫలమయ్యారని పేర్కొన్నారు.
విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్నారని, వారి సమర్థతపై తక్షణమే దృష్టి సారించాలని సూచించారు. వారి నిర్లక్ష్య వైఖరి వల్ల తన జీవితానికి, స్వేచ్ఛకు ప్రమాదం ఉండొచ్చనే అనుమానాలను వ్యక్తం చేశారు. వారిని సస్పెండ్ చేయాలని ఆదేశిస్తూ జస్టిస్ గౌరవ్ కాంత్ ఈ లేఖను రాశారు.
ఈ లేఖ రాసిన కొద్దిరోజులకే బదిలీని ఎదుర్కొన్నారు. ఢిల్లీ హైకోర్టు నుంచి కోల్కత హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని అయిదుమంది సభ్యులు గల కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. దీన్ని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ యధాతథంగా ఆమోదించింది. ఫలితంగా జస్టిస్ గౌరంగ్ కాంత్.. బదిలీ అయ్యారు. బాధ్యతలను కూడా స్వీకరించారు.












Click it and Unblock the Notifications