నా తండ్రి చావుపుట్టుకలే మలుపు.. అందుకే పార్టీ మార్పు.. జ్యోతిరాదిత్య సంచలన వ్యాఖ్యలు
దేశరాజకీయాల్లో సంచలనంగా మారిన మధ్యప్రదేశ్ సంక్షోభానికి కారకుడు.. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన జ్యోతిరాదిత్య సింధియా బుధవారం అధికారికంగా బీజేపీలో చేరారు. ఢిల్లీలో పార్టీ చీఫ్ జేపీ నడ్డా ఆయనకు ప్రధమిక సభ్యత్వమిచ్చి, కాషాయ కండువా కప్పారు. సింధియా రాజుల పూర్వీకురాలలైన రాజమాత యశోధరా.. జన సంఘ్, బీజేపీ స్థాపనలో కీలకంగా వ్యవహరించారని, ఆమె మనవడైన జ్యోతిరాదిత్య తన కుటుంబగౌరవాన్ని నిలబెడుతూ బీజేపీలో చేరడం గర్వకారణంగా ఉందని జేపీ నడ్డా అన్నారు. అనంతరం సింధియా మాట్లాడుతూ.. కాంగ్రెస్ కు వీడటానికి గల కారణాలను వివరించారు..

ఆ రెండు తేదీలు..
‘‘ప్రతి వ్యక్తి జీవితంలో కొన్ని సంఘటనలు మలుపులకు దారితీస్తాయి. నాకు సంబంధించినంత వరకు.. రెండు తేదీలు ఎంతో మహత్తరమైనవి. మొదటిది 30 సెప్టెంబర్, 2001. ఆ రోజు నా తండ్రి(మాధవరావు సింధియా)ని కోల్పోయాను. ఆ రోజు నుంచి నా జీవితం మొత్తం మారిపోయింది. ఇక రెండోది.. 10 మార్చి, 2020. ఇది నా తండ్రి జయంతిదినోత్సవం. మన పరమ లక్ష్యం ప్రజాసేవ అయిఉండాలని, దాన్ని నెరవేర్చడానికి ఒక మార్గంగా మాత్రమే రాజకీయాలు ఉండాలని నాన్న చెప్పేవారు. గడిచిన 19 ఏళ్లూ ఆయన అడుగుజాడల్లోనే నడిచాను. కాంగ్రెస్ పార్టీ ద్వారా మధ్యప్రదేశ్కు, దేశానికి నావంతు సేవ చేశాను. అయితే..

బాధతోనే నిర్ణయం..
కాంగ్రెస్ మునుపటిలా లేదిప్పుడు. అక్కడి నేతలెవరూ వర్తమానాన్ని, వాస్తవాల్ని అర్థం చేసుకునే స్థితిలో లేరు. కాంగ్రెస్ ను వీడుతున్నందుకు నాకు చాలా బాధగానే ఉంది. కానీ ఆ పార్టీ ద్వారా ప్రజాసేవ చేసే వీలు లేనేలేదిప్పుడు. కనీసం వైఫల్యాలపై విశ్లేషణ కూడా చేసుకోకుండా, కొత్త నాయకత్వానికి చోటు కల్పించకుండా కాంగ్రెస్ హైకమాండ్ వ్యవరించిన తీరుతో నేను విసిగిపోయాను. జాతీయ స్థాయిలోనేకాదు.. మధ్యప్రదేశ్ లోనూ పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. అదీగాక..

అత్యాచారాల మాఫియా..
మధ్యప్రదేశ్ లో 2018లో కోటి ఆశలతో కాంగ్రెస్ సారధ్యంలో ఫ్రభుత్వం ఏర్పాటైంది. కానీ 18 నెలలు తిరిగేలోపే ఆశలు ఆవిరైపోయాయి. 10 రోజుల్లోనే రుణమాఫీ చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చినా.. ఇప్పటిదాకా గతిలేదు. గత సీజన్ పంటలకు బోనస్ కూడా ఇవ్వలేదు. మాంద్సోర్ కాల్పుల ఘటనలకు సంబంధించి రైతులపై పెట్టిన కేసుల్ని ఎత్తేస్తామన్న హామీ కూడా నెరవేరలేదు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో సమాంతర శక్తులు, అత్యాచారాల మాఫియా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి. సత్యాన్నే నమ్ముకున్న మనుషులు అలాంటి చోట ఇమడలేరు. అందుకే నేను పార్టీ మారాలని నిర్ణయించుకున్నాను. దేశంలో అభివృద్ధి, వికాసం బీజేపీతోనే సాధ్యమని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను''అని జ్యోతిరాదిత్య వివరించారు.
Recommended Video


మోదీ మహా ఘనుడు..
బీజేపీలో చేరిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, పార్టీ చీఫ్ జేపీ నడ్డాలపై సింధియా ప్రశంసలవర్షం కురిపించారు. దేశ చరిత్రలో రెండుసార్లు బంపర్ మెజార్టీతో గెలిచిన ఘనత మోదీదేనని, ఆ మ్యాండేట్ ఆధారంగా ప్రజలకు ఎన్నెన్నో మేలులు చేస్తున్నారని, రేపటి గురించి కూడా ఆలోచించి వినూత్న పథకాలను అమల్లోకి తీసుకొచ్చారని, మోదీ నాయకత్వంలోనే భారత్ కు బంగారు భవిష్యత్తు ఉంటుందని, ప్రపంచ దేశాల్లో ఇండియా పలుకుబడిని మరింతగా పెంచింది కూడా మోదీనే అని జ్యోతిరాదిత్య చెప్పుకొచ్చారు. బీజేపీ ప్రజాస్వామిక పార్టీ అని ఎవరికి తగ్గట్లు వాళ్లకు అవకాశాలొస్తాయని, సింధియాకు కూడా మంచి అవకాశమే దక్కుతుందని నడ్డా హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications