సింధియా కాంగ్రెస్ను వీడటం వెనుక కారణమదే : సింధియా సోదరుడు ప్రద్యోత్ మాణిక్య
కాంగ్రెస్ పార్టీ పట్ల అత్యంత విధేయత గల కుటుంబం నుంచి వచ్చిన జ్యోతిరాధిత్య సింధియా ఆ పార్టీని వీడటం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సింధియా కాంగ్రెస్ పార్టీలో మూడో తరం నాయకుడు. ఆయన కంటే ముందు విజయరాజే సింధియా,మాధవ్ రాజ్ సింధియా కాంగ్రెస్లో సుదీర్ఘ కాలం పనిచేశారు. అయితే విజయరాజే సింధియా 1967లో కాంగ్రెస్ను వీడి జనసంఘ్లోకి వెళ్లిపోయారు. ఇప్పుడు నాయనమ్మ బాటలోనే.. కాంగ్రెస్తో అనుబంధాన్ని తెంచుకుని జ్యోతిరాధిత్య సింధియా బీజేపీలోకి వెళ్తుండటం గమనార్హం.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆయన.. సీఎం సీటుపై ఆశలు పెట్టుకుని భంగపడ్డాడు. తాజాగా రాజ్యసభ విషయంలోనూ కాంగ్రెస్ తాత్సారంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీని వీడారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సింధియా కాంగ్రెస్ నుంచి నిష్క్రమించడంపై తాజాగా ఆయన సోదరుడు,త్రిపుర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ప్రద్యోత్ మాణిక్య పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

రాజీనామాకు కారణమదే..
రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్న జ్యోతిరాధిత్య సింధియా.. కొన్ని నెలలుగా రాహుల్తో అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నా లాభం లేకపోయిందని ప్రద్యోత్ మాణిక్య చెప్పారు. తమ వాణి వినేందుకు రాహుల్కు ఇష్టం లేకపోతే పార్టీలో ఎందుకు చేర్చుకున్నట్టు అని సింధియా అసంతృప్తితో ఉన్నట్టు చెప్పారు. రాజీనామా విషయంపై సింధియాతో తాను మాట్లాడానని.. రాహుల్తో అపాయింట్మెంట్ కోసం వేచి చూసి.. చూసీ.. ఇక నిరీక్షించే ఓపిక లేకనే ఈ నిర్ణయానికి వచ్చానని చెప్పినట్టు తెలిపారు.

తమ అభిప్రాయాలకు విలువ లేదన్న ప్రద్యోత్
గతేడాది తాను త్రిపుర కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నాక.. యువ నేతలంతా అనాథల్లా మిగిలిపోయామన్న భావనలో ఉండిపోయారని ప్రద్యోత్ మాణిక్య అన్నారు. రాహుల్ గాంధీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుని సోనియా గాంధీ డ్రైవింగ్ సీటులోకి వచ్చాక పార్టీలో అనేక మార్పులు సంభించాయన్నారు. పార్టీలో సోనియా చుట్టూ చేరిన దిగ్గజ నేతలకు,రాహుల్ చుట్టూ చేరిన యువ నేతలకు మధ్య అంతరం పెరిగిందన్నారు. తమ లాంటి నేతలను పక్కనపెట్టడమే కాకుండా.. సీనియర్ నేతలు తమ నిర్ణయాలు,విధానాలను వ్యతిరేకించడం మొదలుపెట్టారన్నారు.నాయకుడు తమ మాట వినే పరిస్థితుల్లో లేనప్పుడు.. తమ నిర్ణయాలకు ప్రాధాన్యం లేనప్పుడు పార్టీ నుంచి తప్పుకోవడానికి సమయం ఆసన్నమైనట్టేనని ప్రద్యుత్ తెలిపారు.
Recommended Video


బీజేపీలో చేరడం లాంఛనమే..
జ్యోతిరాధిత్య సింధియాను కాంగ్రెస్ పార్టీ బహిష్కరించిన సంగతి తెలిసిందే. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అనంతరం ఆయనపై వేటు పడింది. బీజేపీలో రాజ్యసభ సీటుతో పాటు కేంద్రమంత్రి పదవి కోసం ఆయన కమలం పార్టీతో అవగాహనకు వచ్చినట్టు తెలుస్తోంది. తన వెంట ఉన్న 21 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా బీజేపీ వెంట నడవడం లాంఛనమే అని చెప్పాలి.

కాంగ్రెస్ సర్కార్ కూలిపోవడం ఖాయమే..
గత కొన్నాళ్లుగా మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోబోతుందా అనే రీతిలో పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇటీవల ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ ఓ హోటల్లో నిర్బంధించిందని కాంగ్రెస్ ఆరోపించడం దీనికి బలం చేకూర్చాయి. ఆ తర్వాత కొద్దిరోజులకే జ్యోతిరాధిత్య సింధియా సహా 18 మంది ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం.. ఇక ప్రభుత్వం కూలిపోవడం ఖాయమనే సంకేతాలిచ్చాయి. సింధియా అధికారికంగానే బీజేపీ అగ్ర నేతలతో భేటీ అవడం దాన్ని ధ్రువీకరించింది. ఇదే క్రమంలో దాదాపు 21 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 122 నుంచి 101కి పడిపోయింది. దీంతో కాంగ్రెస్ సర్కార్ కూలిపోవడం దాదాపు లాంఛనమే అని చెప్పాలి.












Click it and Unblock the Notifications