టీవీ లేదు, రేడియోనే: కలాం మృతిపై సెక్రటరీ
న్యూఢిల్లీ: హ్యారీ షెరిడన్(53) భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వద్ద గత 24 ఏళ్లగా వ్యక్తిగత కార్యదర్శిగా పని చేశారు. అబ్దుల్ కలాం చనిపోయారన్న వార్తను తానిప్పటికీ నమ్మలేక పోతున్నానని తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రపతిగా ఆయన గడిపిన నిరాడంబర జీవితం గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నారు. అబ్దుల్ కలాం ఇంట్లో టీవీ కూడా లేదని, కేవలం ఆలిండియా రేడియో విని వార్తలు, విశేషాలను తెలుకునేవారని హ్యారీ షెరిడన్ చెప్పారు.
సోమవారం మధ్యాహ్నం 12.20 గంటల సమయంలో ఢిల్లీ నుంచి బయల్దేరేసరికి కలాం ఆరోగ్యం బాగుందని, మంగళవారం సాయంత్రానికి ఆయన తిరిగి రావాల్సి ఉందని తెలిపారు. రాత్రి 7 గంటల ప్రాంతంలో ఆయనకు ఆరోగ్యం బాలేదని ఫోన్ వచ్చిందని అన్నారు.

ఐఐఎం షిల్లాంగ్లో ఉపన్యసిస్తూ కళ్లు తిరిగి పడిపోయారని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారని ఫోన్లో తెలిపారని పేర్కొన్నారు. కాసేపటికే మరో ఫోన్ వచ్చిందని, మిలటరీ వైద్యులు కలాం మరణించినట్లు ప్రకటించారని షెరిడన్ తెలిపారు.
డీఆర్డీఓలో రక్షణ మంత్రికి శాస్త్రీయ సలహాదారుగా కలాం చేరినప్పుడే ఆయన వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా చేరినట్లు షెరిడన్ తెలిపారు. ఉదయం 6.30 గంటల నుంచి రేడియో వినడంతో ఆయన దినచర్య ప్రారంభం అయ్యేదని, అర్ధరాత్రి 2 గంటల వరకు మేలుకుని ఉండేవారని చెప్పారు.
ప్రతిరోజూ తప్పనిసరిగా ఈమెయిల్స్ మాత్రం చూసుకునేవారన్నారు. ప్రతివారం కూడా ఏదో ఒక సెమినార్కు వెళ్లి వచ్చేవారని తెలిపారు. కలాం వ్యక్తిగత ఫిజిషియన్ ఆయన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద పెట్టి, తరచూ ట్రీట్మెంట్ అందించేవారని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications