పెట్రోలింగ్ పోలీసే దొంగ: షాపు ముందు నిద్రిస్తున్న వ్యక్తి మొబైల్ చోరీ, వీడియో వైరల్
లక్నో: దొంగలు, నేరస్తుల నుంచి ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఓ పోలీసు అధికారి.. అతని బాధ్యతను మరిచి దొంగగా మారిపోయాడు. రోడ్డుపై నిద్రిస్తున్న ఓ వ్యక్తి నుంచి మొబైల్ ఫోన్ను దొంగిలించాడు. అయితే, అతడు చేసిన ఈ దొంగ పని అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో సస్పెండ్ అయ్యాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్లో చోటు చేసుకుంది.
కాన్పూర్ మహారాజ్పూర్ ప్రాంతంలోని ఛత్మారా కూడలి వద్ద రాత్రి పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో.. నిందిత కానిస్టేబుల్ రోడ్డు పక్కన నిద్రిస్తున్న వ్యక్తి మొబైల్ను దొంగిలించాడు. కానిస్టేబుల్ చేసిన పని అంతా సీసీటీవీలో రికార్డయింది.
నిందిత కానిస్టేబుల్ ప్రగేష్ సింగ్ వరండాలో నిద్రిస్తున్న వ్యక్తి వద్దకు వెళ్లి అతని మొబైల్ దొంగిలించి పారిపోవడం అక్కడి సీసీ కెమెరాల్లో నమోదైంది.
ఆ తర్వాత వీడియో వైరల్ కావడంతో.. పోలీసు ఉన్నత అధికారులు ఈ విషయంపై దర్యాప్తునకు ఆదేశించారు. మహరాజ్పూర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న తైపట్ ప్రగేష్ సింగ్గా గుర్తించి, అతడ్ని విధుల నుంచి సస్పెండ్ చేశారు.
కానిస్టేబుల్తో పాటు ఓ హోంగార్డు జవాన్ కూడా అక్కడే ఉన్నాడు. త్వరలో హోంగార్డు జవాన్పై కూడా చర్యలు తీసుకుంటామన్నారు.
A police personnel steals mobile phone from a poor labourer sleeping on Sidewalk. Imagine going to the police station for an FIR. https://t.co/2li29712oy
— Shubham Mishra (@shubhamwriting) October 9, 2022
మహారాజ్పూర్ ఛత్మారా నివాసి నితిన్ సింగ్ శనివారం రాత్రి కూడలిలో ఉన్న తన దుకాణం వరండాలో నిద్రిస్తున్నాడు. శనివారం రాత్రి, మహారాజ్పూర్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ ప్రగేష్ సింగ్. ఒక హోంగార్డు ఛత్మారా కూడలిలో విధులు నిర్వహించారు.
బాధితుడు నితిన్ సింగ్, నిందితుడు కానిస్టేబుల్ ప్రగేష్ సింగ్, హోంగార్డు లైక్ సింగ్లపై మహరాజ్పూర్ పోలీస్ స్టేషన్లో మొబైల్ చోరీకి సంబంధించి ఫిర్యాదు చేశాడు. ఘటనపై పూర్తి దర్యాప్తునకు ఆదేశించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. నిందితులు గతంలో కూడా ఇలాంటి నేరాలకు పాల్పడ్డారా? అనేదానిపై విచారణ జరుపుతున్నారు.