కర్ణాటక రిలీఫ్ ప్యాకేజీ : రైతులు,దోబీలు,బార్బర్స్,చేనేత కార్మికులు.. ఎవరికెంత..?
కరోనా లాక్ డౌన్ కారణంగా ఆర్థికంగా చితికిపోయిన ఆయా రంగాలకు కర్ణాటక ప్రభుత్వం రిలీఫ్ ప్యాకేజీ ప్రకటించింది. ముఖ్యమంత్రి యడియూరప్ప రూ.1610కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. రైతులు,పువ్వుల పెంపకందారులు,వాషర్మెన్,ఆటో రిక్షా,ట్యాక్సీ డ్రైవర్స్,చిన్న,మధ్య తరహా పరిశ్రమల యజమానులు,చేనేత వృత్తివారు,భవన నిర్మాణ కార్మికులకు ఈ ప్యాకేజీ ద్వారా సాయం అందించనున్నారు. అలాగే ఎక్సైజ్ సుంకాన్ని కూడా 11శాతం మేర పెంచుతున్నట్టు యడియూరప్ప ప్రకటించారు.
Recommended Video
పూల పెంపకందారులకు రిలీఫ్ ప్యాకేజీ..
ఈ ఏడాది కర్ణాటకలో దాదాపు 11,687హెక్టార్లలో పూల మొక్కల సాగు చేపట్టారు.లాక్ డౌన్ కారణంగా కొనేవాళ్లు లేక వారు తీవ్రంగా నష్టపోయారు. చాలాచోట్ల పూల మొక్కలను తగలబెట్టారు. ఈ నేపథ్యంలో పూల పెంపకందారులను ఆదుకునేందుకు ప్రభుత్వం హెక్టారుకు రూ.25వేలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది. గరిష్టంగా కేవలం ఒక హెక్టారుకు మాత్రమే ఆర్థిక సాయం అందించనుంది.
రైతులు,బార్బర్స్,దోబీలకు..
కూరగాయలు,పండ్లు సాగుచేసిన రైతులు కూడా వాటిని మార్కెట్కు తరలించే రవాణా సౌకర్యాలు లేక నష్టపోయారు. దీంతో ప్రభుత్వం వారిని కూడా ఆదుకోవాలని నిర్ణయించింది. అలాగే లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన దోబీలు,బార్బర్స్ను కూడా ఆదుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా బార్బర్స్,దోబీలకు రిలీఫ్ ప్యాకేజీ కింద ఒక్కసారే రూ.5వేలు అందించనున్నారు. తద్వారా 60వేల మంది దోబీలు,2,30,000 మంది బార్బర్స్ లబ్ది పొందనున్నారు.
ఆటో డ్రైవర్లు,ట్యాక్సీ డ్రైవర్లకూ..
లాక్ డౌన్ కారణంగా ఆటో యజమానులు,ట్యాక్సీ డ్రైవర్లు కూడా నష్టపోవడంతో వారికి పరిహారం కింద రూ.5వేలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే చిన్న,మధ్య తరహా పరిశ్రమలకు రెండు నెలల విద్యుత్ బిల్లులను మాఫీ చేసింది. అలాగే పెద్ద పరిశ్రమల విద్యుత్ బిల్లులు రెండు నెలల పాటు పెనాల్టీ,వడ్డీ లేకుండా వాయిదా వేయడానికి నిర్ణయించింది. అలాగే అన్ని వర్గాల విద్యుత్ వినియోగదారులకు లబ్ది చేకూరేలా కొన్ని నిర్ణయాలు ప్రకటించారు. ఇందులో భాగంగా చేనేత కార్మికులకు ఇప్పటికే ప్రకటించిన రూ.109కోట్లు రుణమాఫీ కింద రూ.80కోట్లు తక్షణం విడుదల చేయనున్నారు. 2019-20 సంవత్సరం కింద ఇప్పటికే రూ.29కోట్లు విడుదల చేశారు.
చేనేత కార్మికులకు..
చేనేత కార్మికుల కోసం వీవర్ సమ్మాన్ యోజనా అనే కొత్త పథకాన్ని కూడా ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రకటించారు. ఈ పథకం కింద రూ.2వేలు చేనేత కార్మికుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేయనున్నారు. తద్వారా 54వేల మంది చేనేత కార్మికులను ఆదుకోనున్నారు. ఇక రాష్ట్రంలో ఉన్న 15.80లక్షల రిజిస్టర్డ్ భవన నిర్మాణ కార్మికుల్లో.. ఇప్పటికే 11.80లక్షల మందికి రూ.2వేలు నగదు బదిలీ చేసింది. మిగతా కార్మికులకు కూడా ఆ నగదును అందించే చర్యలు కొనసాగుతున్నాయి.