కరోనా: సామాజిక దూరాన్ని మరిచిన వైద్య మంత్రి, విమర్శలు
బెంగళూరు: కర్ణాటక ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి బీ శ్రీరాములు కరోనావైరస్ నేపథ్యంలో ప్రజలకు జాగ్రత్తలు, సూచనలు చెప్పారు. అయితే, కరోనా నివారణలో అత్యంత కీలకమైన సామాజిక దూరాన్ని మాత్రం ఆయనే పాటించకపోవడం గమనార్హం.
చిత్రదుర్గా ప్రాంతంలో మంత్రి శ్రీరాములు రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో అక్కడికి పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు. రేషన్ సప్లై కిట్స్ పంపిణీ చేసే సమయంలో ప్రజలంతా సామాజిక దూరాన్ని పాటించకుండా దగ్గర దగ్గరగా ఉన్నారు. అంతేగాక, అక్కడికి చేరుకున్న ప్రజల్లో కొందరు మాస్కులు కూడా ధరించకపోవడం గమనార్హం. దీంతో మంత్రి వ్యవహారంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చినప్పుడు మాస్కులు ధరించాలని ఇప్పటికే ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. గౌరసముద్ర, దేవరదిహళ్లి, బేదరడ్డీ, మన్నెకోటే, తలుక్కరామమ్ గ్రామాల్లో ఆశా వర్కర్లతో కలిసి ప్రజలకు నిత్యావసర వస్తువులను అందించామని మంత్రి శ్రీరాములు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. సామాజిక దూరం పాటించడంతోపాటు మాస్కులు ధరించాలని ఈ సందర్భంగా మంత్రి శ్రీరాములు తెలిపారు.
కాగా, కర్ణాటకలో నాయకులు లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించడం ఇదే తొలిసారి కాదు. బీజేపీ ఎమ్మెల్యే జయరాం కూడా ఇటీవల తన పుట్టిన రోజు వేడుకలను నిబంధనలను పాటించకుండా పలువురితో జరుపుకున్న విషయం తెలిసిందే. కాగా, బుదవారం 73ఏళ్ల వ్యక్తి కరోనాబారినపడి మరణించాడు. దీంతో కర్ణాటకలో కరోనా మరణాలు 21కి చేరాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 535కు చేరాయి. 216 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.