ఫైనాన్స్: రూ 3 లక్షల రూ. 2,000 నోట్లు సీజ్
బెంగళూరు: పెద్ద నోట్లు రూ.1,000, రూ.500 రద్దు చేసినా వడ్డీ వ్యాపారులు, బ్లాక్ మనీ ఉన్న వారు విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారు. బ్యాంకుల్లో వారికి ఉన్న పరిచయాలతో ఎలాంటి ఆటంకాలు లేకుండా విచ్చలవిడిగా కొత్త రూ. 2,000, రూ.500 నోట్లు తీసుకుని వ్యాపారం చేసుకుంటున్నారు.
కర్ణాటకలోని తుమకూరులోని శ్రీరాజ్ సినిమా థియేటర్ సమీపంలో చోళమండల ఫైనాన్స్ కంపెనీ ఉంది. ఈ కంపెనీలో పని చేస్తున్నపద్మరాజ్ అనే వ్యక్తి అనుమానాస్పందంగా వెలుతున్న విషయం గుర్తించిన క్యాతసంద్ర పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
అతని దగ్గర రూ. మూడు లక్షల విలువైన రూ.2,000 నోట్లు స్వాధీనం చేసుకున్నారు. రూ. మూడు లక్షల విలువైన కొత్త నోట్లకు సంబంధించి పద్మరాజ్ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని పోలీసులు అన్నారు. ఇతను ఇంత పెద్ద మొత్తంలో రూ.2,000 నోట్లు ఎలా తీసుకువచ్చారు అని ఆరా తీస్తున్నామని పోలీసులు చెప్పారు. పద్మరాజ్ మీద కేసు నమోదు చేశామని, అతను ఇంతకు ముందు ఎంత మొత్తంలో రూ. 2,000 నోట్లు తీసుకున్నాడు అని ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.