అదే జరిగితే బీజేపీకి చావుదెబ్బే?: కర్ణాటకలో కమలానికి 'తెలుగు' గండం!..
హైదరాబాద్: కర్ణాటక ఎన్నికల్లో బీజేపీని చావుదెబ్బ కొట్టేందుకు తెలుగువారు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కర్ణాటకలో బీజేపీ గెలవకూడదని వారు కంకణం కట్టుకున్నారు. ఈ మేరకు ఇప్పటికే వారు విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో ఈ ఎఫెక్ట్ కచ్చితంగా బీజేపీని వెంటాడే అవకాశం ఉందంటున్నారు పరిశీలకులు.
కర్ణాటకలో తెలుగు మాట్లాడే దాదాపు 10వేల కుటుంబాలు కలిసి కర్ణాటక తెలుగు అసోసియేషన్(టీఏకె) పేరిట ఓ సంఘం ఏర్పాటు చేసుకున్నాయి. 'బీజేపీకి ఓటు వేయవద్దు' అన్న నినాదంతో ఈ సంఘం అక్కడ విస్తృతంగా ప్రచారం చేసింది. ప్రత్యేక హోదా ఇవ్వకుండా 'బీజేపీ తెలుగువారిని మోసం చేసింది' అన్న ప్లకార్డులు, బ్యానర్లతో వారు ప్రచారం నిర్వహించారు.

7లక్షల మంది తెలుగు ఓటర్లు
కర్ణాటకలో దాదాపు 7లక్షల మంది తెలుగువారు ఉన్నట్టు అంచనా. వారి మూలాలన్ని ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నాయి. వీళ్లంతా టీఏకె నిర్వహించిన ప్రచారాల్లో భాగస్వాములయ్యారు. ఈ సంఘం ప్రచారం గనుక ఇలాగే కొనసాగితే 25 నుంచి 30 స్థానాల్లో బీజేపీ గెలుపును కచ్చితంగా వారు ప్రభావితం చేయగలరని అంటున్నారు.
ఇక తెలంగాణ ఓటర్లు కూడా వీరికి జతచేరితే ఆ ప్రభావం మరింత ఎక్కువే అన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పుడు వీరి ఓటు బ్యాంకు 10లక్షల వరకు చేరుతుంది.

మా ఎజెండా ఒక్కటే
ఇదే విషయమై టీఏకె సెక్రటరీ సుందర్ రామ్ చాగంటి ఓ దినపత్రికతో మాట్లాడారు. 'కర్ణాటకలో ఉన్న తెలుగువాళ్లలో దాదాపు 70శాతం మంది ఏపీకి చెందినవారే. వాళ్లంతా ఇప్పుడు మరాఠహళ్లి, బీటీఎం(బైరాసాంధ్ర, తవరెకెరె, మదివాలా), ఎలందూర్ర, దోమ్లూర్ లపై ఫోకస్ చేశారు. మా ఎజెండా ఒక్కటే.. బీజేపీకి ఓటు వేయవద్దు. ప్రస్తుతం టీఎకె కింద 7లక్షల మంది తెలుగువాళ్లు ఉన్నారు. మేమంతా ఒకే స్టాండ్ పై ఉంటే బీజేపీ 7లక్షల ఓట్లు కోల్పోయినట్టే' అని ఆయన చెప్పుకొచ్చారు.

3లక్షల మంది తెలంగాణ ఓటర్లు
టీఏకె జాయింట్ సెక్రటరీ కీర్తి రెడ్డి మాట్లాడుతూ.. 'ఇది ఉవ్వెత్తున జరుగుతున్న ప్రచారపర్వం. ఏపీకి చెందినవాళ్లనే కాదు తెలంగాణ ప్రజలను కూడా ఇందులో భాగస్వాములం చేయాలనుకుంటున్నాం. ప్రధానంగా బసవ-కల్యాణ్, బీదర్, బల్లారి ప్రాంతాల్లో 3లక్షల మంది తెలంగాణ సెటిలర్స్ సఉన్నారు. వాళ్లందరిని బీజేపీకి ఓటువేయవద్దని కోరుతున్నాం' అని తెలిపారు.
కాగా, చాలామంది తెలుగువాళ్లు గత రెండు దశాబ్దాలుగా కర్ణాటకనే తమ సొంత గడ్డగా చేసుకున్నారు. 'కర్ణాటకలో మేమూ భాగమే, కానీ మా మూలాలు ఉన్న ఆంధ్రాను ఎప్పటికీ మరిచిపోలేం. బీజేపీని ఓడించడం కోసం మా వంతు ప్రయత్నం చేస్తున్నాం' అని పవన్ కుమార్ అనే మరో టీఏకె జాయింట్ సెక్రటరీ తెలిపారు.

టెకీల దెబ్బ కూడా పడవచ్చు!
కర్ణాటకలో సెటిల్ అయిన తెలుగువాళ్లలో ఎక్కువగా అర్బన్, సబ్-అర్బన్ ప్రాంతాల్లోనే ఉంటున్నారు. వీరిలో ఎక్కువమంది ఐటీ సెక్టార్ లోనే సెటిల్ అవగా, ఎడ్యుకేషన్, మెడిసిన్ వంటి రంగాల్లోనూ చాలామందే ఉన్నారు. మహదేవపుర, మరాఠహళ్లి, వైట్ ఫీల్డ్ వంటి ప్రాంతాల్లో టెకీలు ఎక్కువగా ఉన్నారు. వీరంతా బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తే ఆ పార్టీకి పూడ్చలేని నష్టం జరగడం ఖాయం అంటున్నారు.












Click it and Unblock the Notifications