ఉప ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్: మరో బిగ్ వికెట్: కర్ణాటక కాంగ్రెస్ కకావికలం..!
బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ కకావికలమౌతోంది. ఒకదాని వెంట ఒకటిగా వరుస వికెట్లు టపటపంటూ పడుతున్నాయ్. కర్ణాటక కాంగ్రెస్ కు పెద్దదిక్కుగా ఉంటూ వచ్చిన మాజీ ముఖ్యమంత్రి, శాసన సభా పక్ష నేత సిద్దరామయ్య తన పదవికి రాజీనామా చేసిన సంఘటన సృష్టించిన ప్రకంపనలు సద్ధుమణగకముందే.. మరో సీనియర్ నాయకుడు బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. ఆయనే దినేష్ గుండూరావు. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు.

నైతిక బాధ్యత నాదే..
ఉప ఎన్నికల ఫలితాల్లో పార్టీ ఏ మాత్రం ప్రభావం చూపకపోవడాన్ని దృష్టిలో ఉంచుకుని తాను పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు దినేష్ గుండూరావు ప్రకటించారు. ఎన్నికల ఫలితాలు ముగిసిన వెంటనే ఆయన గాంధీభవన్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తన రాజీనామా విషయాన్ని వెల్లడించారు. ఉప ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి తాను నైతిక బాధ్యతను వహిస్తున్నానని అన్నారు.

వ్యూహాలను రూపొందించడంలో విఫలం..
అభ్యర్థులకు దిశా నిర్దేశం చేయడంలో, పార్టీని విజయపథంలో నడిపించడంలో పీసీసీ అధ్యక్షుడిగా విఫలం అయ్యానని చెప్పారు. ఉప ఎన్నికల ఫలితాలు పార్టీకి వ్యతిరేకంగా వెలువడటానికి పరోక్షంగా తానూ ఓ కారణంగా మారానని, వ్యూహాలను రూపొందించడంలో విఫలమైనట్లు భావిస్తున్నానని చెప్పారు. సాధారణంగా- ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకోవడం ఆనవాయితీగా వస్తున్నప్పటికీ.. దానికి అడ్డుకట్ట వేయడానికి తాము శక్తివంచన లేకుండా పని చేశామని దినేష్ గుండూరావు చెప్పుకొచ్చారు.

ప్రజా తీర్పును శిరసా వహిస్తాం..
ప్రజాతీర్పును తాము శిరసా వహిస్తున్నామని, పార్టీ అభ్యర్థుల ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకొంటున్నట్లు వెల్లడించారు. తన రాజీనామా పత్రాన్ని ఏఐసీసీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపించినట్లు తెలిపారు. పార్టీ అధిష్ఠానం బుజ్జగించినప్పటికీ.. రాజీనామాను వెనక్కి తీసుకోవాలనే ఆలోచన ప్రస్తుతం తనకు లేదని దినేష్ గుండూరావు ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

ఉప ఎన్నికల్లో హస్తం పార్టీ కకావికలం..
కర్ణాటకలో మొత్తం 15 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 5వ తేదీన ఉప ఎన్నికలను నిర్వహించిన విషయం తెలిసిందే. వాటి ఫలితాలను సోమవారం వెల్లడించారు. మొత్తం 15 స్థానాలకు 12 సీట్లలో భారతీయ జనతా పార్టీ తన కాషాయ జెండాను ఎగురవేసింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు రెండు చోట్ల మాత్రమే విజయం సాధించగలిగారు. జనతాదళ్ (సెక్యులర్) ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది. ఈ ఉప ఎన్నికల ఫలితాలు పార్టీకి వ్యతిరేకంగా రావడంతోో మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య ఇప్పటికే తన శాసనసభా పక్ష నాయకత్వానికి రాజీనామా చేశారు. ఆ వెంటనే- పీసీసీ అధ్యక్షుడిగా దినేష్ గుండూరావు తప్పుకొన్నారు.












Click it and Unblock the Notifications