సరి- బేసి వెనక భారీ స్కామ్: సిరా చల్లిన భావన
న్యూఢిల్లీ: సరి-బేసి ప్రయోగం వెనుక భారీ సీఎన్జీ కుంభకోణం ఉందని, దాన్ని బయటపెట్టడానికే నేను ఛత్రసాల్ మైదానానికి వెళ్లానని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై సిరా చల్లిన భావన అరోరా ఆరోపించారు. బైకులకు సీఎన్జీ టెస్టింగ్ చేసినట్టు దొంగ సర్టిఫికేట్లు ఇస్తుండగా, చేసిన స్లింగ్ ఆపరేషన్ సీడీ, కొన్ని పత్రాలూ తన దగ్గర ఉన్నాయని భావన తెలిపారు.
దానికి సంబంధించి మాట్లాడ్డానికి తాను చాలాసార్లు ఆప్ నేతల వద్దకు వెళ్లానని, పెద్ద కుంభకోణం జరుగుతోందంటూ కేజ్రీవాల్కు చెప్పడానికి ప్రయత్నించానని, ఆయన తన మాట వినలేదని భావన చెప్పారు. సంబంధిత మంత్రి గోపాల్ రాయ్ తనను కొట్టి మరీ వెళ్లగొట్టారని ఆమె ఆరోపించారు.
ఆమ్ ఆద్మీ సేన పంజాబ్ విభాగానికి అధ్యక్షురాలునని భావన చెప్పారు. భావనా అరోరా ఉదంతాన్ని బిజెపి కుట్రగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఆప్ కార్యకర్తలు తనపై చేయి చేసుకున్నారని ఆమె ఆరోపించారు. తనను సురక్షితంగా బయటకు తెచ్చినందుకు ఆమె పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై సిరా చల్లిన కేసులో భావన ఆరోరా అనే మహిళను ఢిల్లీలోని రోహిణి కోర్టులో సోమవారం ప్రవేశపెట్టనున్నారు. గత రాత్రి ఘటన తర్వాత ఆమెను పోలీసులు నిర్బంధించారు. ఆమెను విచారించిన తర్వాత కేసు నమోదు చేశారు. భావన ఆరోర వ్యక్తిగత పూచీకత్తుమీద బెయిల్ తీసుకున్నారు.