ఫేస్బుక్లో కమెండో నిరంజన్ను అవమానించేలా వ్యాఖ్యలు: కేరళలో వ్యక్తి అరెస్ట్
కొచ్చి: పంజాబ్లోని పఠాన్కోట్ ఎయిర్బేస్పై ఉగ్రవాదులు మెరుపు దాడికి దిగడం... ఆ వెంటనే రంగంలోకి దిగిన నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్జీ) కమెండోలు ఉగ్రవాదులను హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్లో చనిపోయిన ఓ ఉగ్రవాది శరీరానికి ఉన్న బాంబును నిర్వీర్యం చేసే క్రమంలో ఎన్ఎస్జీ కమెండో లెఫ్ట్ నెంట్ కల్నర్ ఈకే నిరంజన్ అసువులు బాశారు.
పఠాన్కోట్ ఉగ్రవాదుల దాడిలో కమెండోల వీరమరణంపై యావత్ దేశం మొత్తం కంటతడి పెడుతుంటే, కేరళకు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఎన్ఎస్జీ కమెండో నిరంజన్ను కించపరుస్తూ ఫేస్ బుక్లో పోస్టు పెట్టాడు. దీంతో రంగంలోకి దిగిన కేరళ పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
వివరాల్లోకి వెళితే, కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన అన్వర్ సాదిఖ్ (24) అనే వ్యక్తి ఫేస్బుక్లో నకిలీ పేరుతో ఖాతా తెరచిన నిరంజన్ సహా చనిపోయిన భద్రతా సిబ్బందిని కించపరిచేలా వ్యాఖ్యలను పోస్ట్ చేశాడు. పోస్టు చేసిన గంటల వ్యవధిలోనే ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకే తెరతీశాయి.
దీంతో రంగంలోకి దిగిన జిల్లాలోని చెవాయుర్ పోలీసులు అన్వర్ను అదుపులోకి తీసుకున్నారు. అన్వర్ ఫేస్బుక్లో చేసిన వ్యాఖ్యలు దేశవ్యతిరేకంగా ఉన్నాయని, అయితే తాను చేసింది నేరమన్న విషయం తనకు తెలియదని అతడు చెబుతున్నట్టు పోలీసులు తెలిపారు.
మధ్యమం అనే దినపత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తున్నట్లు చెప్పాడని అన్నారు. అయితే తమ పత్రికలో అలాంటివాళ్లు ఎవరూ లేరని పత్రిక వర్గాలు తెలిపాయి.