Shigella:వణికిస్తున్న కొత్త బ్యాక్టీరియా...పిల్లలు జాగ్రత్త.. ఆహారం తాగు నీరు నుంచే..!
కోజికోడ్: కరోనావైరస్ దేశాన్ని కుదిపేస్తుండగానే మరో కొత్త బ్యాక్టీరియాతో ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రస్తుతం దేశంలోని చాలామంది ఈ కొత్త ప్రాణాంతక వ్యాధులతో ఆందోళన చెందుతున్నారు. కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లోని ఏలూరులో వింత వ్యాధితో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రెండు రోజుల క్రితం గుజరాత్లోని అహ్మదాబాదులో మరో కొత్త రకం వైరస్తో ప్రజలు వణికిపోయారు. తాజాగా కేరళ రాష్ట్రంలో కొత్త బ్యాక్టీరియాతో ఒకరు మృతి చెందగా పలువురు తీవ్ర అనారోగ్య పాలయ్యారు. ఇంతకీ ఆ కొత్త బ్యాక్టీరియా ఏంటి..?
కేరళ రాష్ట్రం కోజికోడ్లో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్తో ఒకరు మృతి చెందగా 20 మంది అనారోగ్యంతో హాస్పిటల్లో చేరారు. ఇందులో చిన్నారులు ఎక్కువగా ఉన్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. గతవారం ఈ బ్యాక్టిరియాతో బాధపడుతూ 11 ఏళ్ల కుర్రాడు మృతి చెందాడు. అయితే ఈ బ్యాక్టీరియా ఆ కుర్రాడి నుంచే వ్యాపించి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ బ్యాక్టీరియా పేరు షిగెల్లా. షిగెల్లా బ్యాక్టీరియా సోకిన వ్యక్తిలో డయేరియా, జ్వరం, విరేచనాలు, కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి.
కొందరిలో లక్షణాలు కూడా కనిపించకపోవచ్చని వైద్యులు చెబుతున్నారు. మూడు రోజుల పాటు డయేరియా లక్షణాలు ఉంటే అలసత్వం ప్రదర్శించొద్దని వెంటనే డాక్టర్ను సంప్రదించాలని జిల్లా అధికారులు వెల్లడించారు. ఈ బ్యాక్టీరియా తీసుకునే ఆహారం, తాగే నీరు నుంచి మనిషిలోకి వ్యాపిస్తుందని చెబుతున్నారు.
కోజికోడ్లోని కొత్తపరంబు వార్డులోనే ఈ షిగెల్లా ఇన్ఫెక్షన్ లక్షణాలు ఎక్కువగా కనిపించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ వారాంతంలో అక్కడ మెడికల్ క్యాంపు నిర్వహించాలని భావిస్తున్నారు. మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్న ఆరుగురు పేషెంట్ల స్టూల్ శాంపిల్స్ను సేకరించి పరీక్షించగా వారికి షిగెల్లా ఇన్ఫెక్షన్ సోకినట్లు నిర్థారితమైందని కోజికోడ్ జిల్లా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జయశ్రీ చెప్పారు. మరో 20 మందిలో కూడా చాలా తక్కువగా లక్షణాలు కనిపిస్తున్నాయని స్పష్టం చేశారు. షిగెల్లా ఇన్ఫెక్షన్ సాధారణ డయేరియా కంటే ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇది సోకితే మనిషి ప్రాణాలకే ముప్పు ఏర్పడొచ్చని చెబుతున్నారు.